నిర్మించి వదిలేశారు!

2 Aug, 2018 12:05 IST|Sakshi
ప్రారంభానికి నోచుకోని మార్చురీ గది  

అన్నీఉన్నా అల్లుడు నోట్లో శని అన్న సామెత చందాన తయారైంది కేంద్రాస్పత్రిలో నిర్మించిన భవనాల పరిస్థితి. కోట్లాది రుపాయలు వెచ్చించి నిర్మాణాలు పూర్తిచేసినా ప్రారంభించకపోవడం వల్ల రోగులకు ఉపయోగపడకుండా పోయాయి. భవనాలు నిర్మించక ప్రారంభించలేదంటే అదీకాదు. నిర్మాణం పూర్తయినప్పటికీ అధికారులు ఎందువల్లో వినియోగంలోకి తీసుకురావడం లేదు.

విజయనగరం ఫోర్ట్‌ :  కేంద్రాస్పత్రిలో ఉన్న మార్చురి గది శిథిలావస్థకు చేరుకోవడం ఆస్పత్రిలో ఆధునాతన మార్చరీ గదిని సుమారు రూ.1.13 కోట్లుతో నిర్మించారు. నిర్మాణం పూర్తయి ఆరునెలలు కావస్తున్నా ఇంతతవరకు ప్రారంభించలేదు. ప్రస్తుతం ఉన్న మార్చురీ గది చాలా చిన్నది.

శవాలను ఒక రోజు కూడ భద్రపరచుకునే వీలులేని పరిస్థితి. దీనికి తోడు ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉండడంతో మృతదేహాలు ఒకటి రెండు రోజులు ఉన్నా దుర్వాసన వెలువడుతుంది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనాథశవాలను మూడు, నాలుగు రోజుల పాటు భద్రపరచాల్సి ఉంటుంది. అయితే మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్లు పాడవడంతో నేలపైనే మృతదేహాలను ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. 

నిర్మాణం పూర్తయిన ఐసోలేషన్‌ వార్డు 

వివిధ రకాల ఇనఫెక్షన్స్‌తో వచ్చే వారి కోసం రూ.20 లక్షలతో వార్డు నిర్మించారు. నెలరోజుల క్రితమే నిర్మాణం పూర్తయింది. అయినప్పటికీ ప్రారంభించలేదు. ఐసోలేషన్‌ వార్డు లేకపోవడం వల్ల వివిధ ఇన్‌ఫెక్షన్స్‌తో వచ్చే రోగులను ఇన్‌పేషేంట్స్‌గా చేర్చుకోవడం లేదు. ఓపీ సేవలకే పరిమతమవుతున్నాయి. వార్డు వినియోగంలోకి వస్తే ఇన్‌పేషేంట్‌ సేవలు అందుతాయి. 

హోమియో ఆస్పత్రిదీ అదే పరిస్థితి 

అల్లోపతి మాదిరి హోమియో రోగులకుకూడ ఇన్‌పేషేంట్‌ సేవలు అందించాలన్న ఉద్దేశంతో 10 పడకల హోమియో ఆస్పత్రిని రూ.30 లక్షలతో నిర్మించారు. దీని నిర్మాణం పూర్తయి నెలరోజులు కావస్తోంది. ఇదికూడా ప్రారంభానికి నోచుకోలేదు. హోమియో ఆస్పత్రి వినియోగంలోకి వస్తే రోగులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. 

ప్రారంభంకాని పిల్లల వార్డు

ఆస్పత్రిలో పిల్లలకు ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు రూ.53 లక్షలతో పిల్లలవార్డును నిర్మించారు. ఈ వార్డు వినియోగంలోకి వస్తే పిల్లలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందుతాయి. ఇప్పడు మహిళల డయేరియా వార్డుపక్కన పిల్లల వార్డు ఉంది. దీనివల్ల ఇన్‌ఫెక్షన్స్‌ సోకుతాయోమోనని రోగులు ఆందోళన చెందుతున్నారు. 

వినియోగించని అటెండెంట్‌ షెడ్డు 

ఆస్పత్రిలో రోగులతో పాటు వచ్చే బంధువులు వి శ్రాంతి తీసుకోవడం కోసం అటెండ్‌ షెడ్డు నిర్మించారు. దీనివల్ల రూ.15 లక్షల వరకు ఉంటుంది. దీనినిర్మాణం కూడా పూర్తయి 15 రోజులు దాటి ంది. దీన్నికూడా వినియోగంలోకి తీసుకురాలేదు.

త్వరలోనే ప్రారంభిస్తాం

మార్చురీ గదిని త్వరలోనే ప్రారంభిస్తాం. ఐసోలేషన్‌ వార్డు నిర్మాణం పూర్తయినప్పటికీ సిబ్బందిని నియమించాల్సి ఉంది. పిల్లల వార్డును కూడా త్వరలోనే  ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాం

– కె సీతారామరాజు, సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి

మరిన్ని వార్తలు