పొత్తిళ్లలోనే ప్రాణాలు పోతున్నాయి

1 Feb, 2018 04:16 IST|Sakshi

రాష్ట్రంలో నెలకు 782 పసిబిడ్డల మరణాలు 

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 460 మాతా మరణాలు  

ప్రణాళిక శాఖ నివేదికలో స్పష్టీకరణ  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి సూచికలు నేల చూపులు చూస్తున్నాయి. మాతా, శిశు మరణాలను తగ్గించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పౌష్టికాహార లోపం, రక్తహీనత వంటివి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయి. కాన్పు సమయంలో తల్లీబిడ్డల మరణాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది ఆచరణలో సఫలం కావడం లేదని తాజాగా ప్రణాళికా శాఖ నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో శిశు మరణాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు మూడు త్రైమాసికాలను పరిశీలిస్తే తొలి త్రైమాసికంలో శిశు మరణాల సంఖ్య కంటే ఆ తరువాత రెండు, మూడు త్రైమాసికాల్లో మరణాల సంఖ్య పెరగడం గమనార్హం.

నెలకు 782 మంది చొప్పున ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు 9 నెలల్లో 7,037 మంది శిశువులు మృతిచెందారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6,966 మంది పసిబిడ్డలు మరణించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లోనే అంతకంటే ఎక్కువమంది మృత్యువాత పడ్డారు. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రెండో త్రైమాసికం కంటే మూడో త్రైమాసికంలో శిశు మరణాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. చిత్తూరు జిల్లాలో రెండో త్రైమాసికంలో 164 శిశు మరణాలు సంభవించగా, మూడో త్రైమాసికంలో ఆ సంఖ్య 253కి పెరిగింది. పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండో త్రైమాసికంలో 29 మంది, మూడో త్రైమాసికంలో 60 మంది శిశువులు మృతిచెందారు. 

పసిప్రాయం.. పౌష్టికాహారానికి దూరం 
కాన్పు సమయంలో తల్లుల మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో మాతా మరణాల సంఖ్య 517 కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు 9 నెలల్లోనే  460 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లల్లో పెరుగుదల లోపం ఉన్న వారు గతంలో 27.7 శాతం కాగా, ప్రస్తుతం 31.4 శాతానికి పెరింది. ఐదేళ్ల లోపు పిల్లల్లో బరువు తక్కువగా ఉన్న వారు  గతంలో 27.3 శాతం కాగా,  ఇప్పుడు 31.9 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో 10 లక్షల మంది గర్భిణులు రక్తహీనత, కాల్షియం లోపంతో బాధపడుతున్నారని, వీరిలో కేవలం 3.1 లక్షల మందికే పౌష్టికాహారం అందుతోందని ప్రణాళికా శాఖ నివేదిక స్పష్టం చేసింది. అలాగే ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న 19 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, 15.58 లక్షల మందికే అందుతోందని వెల్లడించింది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు వయసున్న 24 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, 8.31 లక్షల మందికే పేర్కొంది. 

మరిన్ని వార్తలు