నీటికుంటలో పడి తల్లీకూతురు మృతి

16 May, 2014 00:10 IST|Sakshi

 కేవీపల్లి, న్యూస్‌లైన్: నీటికుంటలో పడి తల్లీకూతురు మృతిచెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం జిల్లేళ్లమంద పంచాయతీ బసన్నగారిపల్లెలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బండారు వెంకట్రమణ గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఇతను కూలిపనికి వెళ్లడంతో భార్య బీ.రూప(35), కుమార్తె శిరీష(10), కుమారుడు శివలు గొర్రెలను మేత కోసమని గ్రామ శివార్లలో తోలారు. మధ్యాహ్నం ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో గొర్రెలను కడిగేందుకు పక్కనే ఉన్న కంజుమడుగుకు తోలారు. ఆపై వాటిని కడిగి పైకితోలేశారు. గుంటలో నుంచి పైకి ఎక్కేటప్పుడు కుమార్తె శిరీష ప్రమాదవశాత్తు కాలుజారి లోతులో పడిపోయింది. కుమార్తెను రక్షించేందుకు రూప గుంటలోకి దూకేసింది. ఇద్దరూ ఊపిరాడక తల్లడిల్లిపోయారు. గమనించిన శివ బిగ్గరగా కేకలు వేశాడు. గ్రామస్తులు హుటాహుటిన గుంట వద్దకు చేరేలోపే తల్లీకూతురు కన్నుమూశారు.

మరిన్ని వార్తలు