సాక్షి, నరసరావుపేట : ఇద్దరు పిల్లలతో కలసి తల్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన సోమవారం సాయంత్రం నరసరావుపేట పట్టణంలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మీకి ఇద్దరు సంతానం. కూతురు దిగ్విజయ, తనయుడు గణేష్ సాయిలు మార్టూరులో విద్యను అభ్యసిస్తున్నారు.
దిగ్విజయ పుట్టిన రోజు కావడంతో సోమవారం పిల్లలను కలిసేందుకు విజయలక్ష్మీ మార్టూరుకు వెళ్లారు. పిల్లల్ని తీసుకుని సోమవారం మధ్యాహ్నానికి నరసరావుపేట చేరుకున్నారు. మార్కెట్ దగ్గర గల మూడో గేట్ వద్ద గూడ్స్ రైలు వస్తుందనగా పిల్లల్ని రైలు కింద తోసేశారు. అనంతరం తాను రైలు కింద పడ్డారు. ఈ ఘటనలో విజయలక్ష్మీ, ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలయ్యారు.
చూస్తుండగానే తల్లి, పిల్లలు రైలు కింద పడటంతో గేటు వద్ద ఆ సమయంలో ఉన్న వారు షాక్కు గురయ్యారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే విజయలక్ష్మీ పిల్లలతో కలసి ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.