మృత్యుంజయుడు!

4 Aug, 2018 13:13 IST|Sakshi
జగదీష్‌ (ఫైల్‌ ఫొటో)

నందిగామ వాసి బ్రెయిన్‌డెడ్‌

బిడ్డ అవయవాలు దానం చేసిన మాతృమూర్తి

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన నందిగామ పట్టణానికి చెందిన జగదీష్‌ అనే యువకుడు అవయవ దానం ద్వారా పలువురికి ప్రాణ దాత అయ్యాడు. చేతికందిన కొడుకు కళ్ల ముందే విగత జీవిగా మారిన కుమారుడిని చూసి గుండెలవిసేలా రోదిస్తూనే... తనలా మరి కొంత మంది కడుపు కోతతో బాధపడకూడదనే లక్ష్యంతో జగదీష్‌ అవయవాలు దానం చేసేందుకు తల్లి ఒప్పుకుంది.

కృష్ణాజిల్లా, నందిగామ : పది మంది మేలు కోరేవాడు... పది మందికి మంచి చేసేవాడు మహాత్ముడైతే... తను చనిపోతూ.. పదిమందికి ప్రాణ దానం చేసేవాడు దేవుడే. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన నందిగామ పట్టణానికి చెందిన ఓ యువకుడు అవయవ దానంతో  పలువురికి ప్రాణ దాత అయ్యాడు. చేతికందిన కొడుకు కళ్ల ముందే విగత జీవిగా మారడాన్ని చూసి గుండెలవిసేలా రోది స్తూనే... తనలా మరి కొంత మంది కడుపు కోతతో బాధపడకూడదన్న లక్ష్యంతో దుఃఖాన్ని దిగమింగుకొని తన బిడ్డ అవయ దానానికి అంగీకరించిన ఆ మాతృమూర్తి త్యాగం వేనోళ్ల కీర్తించదగిం ది. మూడేళ్ల క్రితమే భర్తను కోల్పోయిన ఆమెకు తానున్నానంటూ ధైర్యం చెప్పి, కుటుంబ భారా న్ని తన భుజ స్కంథాలపై మోస్తూ, కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కుమారుడిపై విధికి కన్ను కుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో విగత జీవిని చేసింది. తనవృత్తి, తన ఇల్లు తప్ప బయటి ప్రపంచం గురిం చి ఏమీ తెలియని ఆ యువకుడు ఇప్పుడు అందరి దృష్టిలో హీరో అయ్యాడు... ఒక్క ముక్కలో చెప్పాలంటే, అతని అవయవాల ద్వారా పునర్జన్మ పొందిన వారికి దేవుడయ్యాడు.

ఈ అమ్మకు శోకం...ఆ తల్లులకు ఆనందం!
నందిగామ పట్టణానికి చెందిన పింగళి జగదీష్‌ (22) నందిగామ పట్టణంలోని ఓ ప్రైవేటు సంస్థలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు. నిరుపేద కుటుంబం కావడంతో అతి తక్కువ వయస్సు నుంచే కుటుంబ భారాన్ని భుజానికెత్తుకున్నాడు. లారీ డ్రైవర్‌గా పనిచేసే జగదీష్‌ తండ్రి నాగశేషు మూడేళ్ల క్రితం గుండెపోటుతో కన్ను మూశాడు. దీంతో జగదీష్‌ బాధ్యతలు మరింత పెరిగాయి. ఉన్నంతలో తల్లిని సంతో షంగా చూసుకునేవాడు. అంతా సవ్యంగా సాగి పోతుందనుకున్న సమయంలో విధి వారిపై పగబట్టింది.

విధి నిర్వహణలో భాగంగా ఇబ్రహీంపట్నం వెళ్లి వస్తూ, ఈ నెల 1న కంచికచర్ల మం డల పరిధిలోని పరిటాల వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. విజయవాడ మణిపాల్‌ హాస్పటల్‌లో చేర్పించగా, బ్రెయిన్‌ డెడ్‌ అని చెప్పడంతో ఆ తల్లి గుండె ఒక్కసారిగా తల్లడిల్లిపోయిం ది. అయితే, అంత దుఃఖం, బాధలోనూ, సన్ని హితులు ఇచ్చిన సలహాతో తన బాధను దిగమింగుకుంటూ, తన బిడ్డ మరి కొందరు రూపంలో జీవించే ఉంటాడన్న ఆలోచనతోపాటు తన లాంటి కొందరు మాతృమూర్తుల గర్భశోకాన్ని తీర్చగలుగుతానన్న సంతృప్తితో జగదీష్‌ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించింది. దీంతో శుక్రవారం జగదీష్‌ అవయవాలను మణిపాల్‌ ఆస్పత్రి నుంచే పలువురికి అమర్చేందుకు తరలించారు.

మరిన్ని వార్తలు