కనిగిరి మండలం కాశిరెడ్డి నగర్లో దారుణం చోటుచేసుకుంది. కొడుకు వేధింపులు భరించలేక కన్నతల్లే అతడిని గొడ్డలితో నరికి చంపేసింది. శివశంకర్ అనే యువకుడు గత పదేళ్లుగా రోజూ తాగి వచ్చి, ఇంట్లో భార్యా బిడ్డలతో పాటు తల్లిని కూడా తీవ్రంగా వేధించేవాడు. ఎవరు ఎంతగా చెప్పినా అతడు తన పద్ధతిని మార్చుకోలేదు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇంట్లో గొడవ జరిగింది. దాంతో సహనం కోల్పోయిన తల్లి నరసమ్మ అతడిని గొడ్డలితో నరికి చంపేసింది. అనంతరం ఇంటి సమీపంలోనే మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టింది.
కాలనీ వాళ్లకు కూడా ఈ విషయం తెలిసినా, శివశంకర్ ఆగడాల గురించి తెలియడంతో ఎవరూ ఈ విషయం బయటపెట్టలేదు. కానీ ఆనోటా ఈనోటా చివరకు పోలీసుల వద్దకు విషయం తెలిసింది. దాంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసే పరిస్థితి లేదు. పోలీసులు వచ్చిన తర్వాత తల్లి నరసమ్మ తన నేరాన్ని అంగీకరించడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.