సాక్షి, అమరావతిబ్యూరో: అటు కన్న తల్లి మరణం.. ఇటు విధి నిర్వహణ.. చివరకు దుఃఖాన్ని దిగమింగుకుంటూ కరోనాపై పోరాటానికే ప్రాధాన్యం ఇచ్చాడా పోలీస్. విజయవాడ రైల్వేశాఖలో శాంతారాం ఎస్ఐ. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విధి నిర్వహణలో తలమునకలై ఉన్నారు. అంతలో విజయనగరం జిల్లా లక్కవరపు కోటలో ఉన్న తన తల్లి మృతిచెందిందని శనివారం ఫోన్ వచ్చింది. వెంటనే వెళ్లాలంటూ అధికారులు సూచిం చారు. తల్లి అంత్యక్రియలు చేసేందుకు తన తమ్ముడున్నాడని, తన తల్లి ఆశయం మేరకు ప్రజాసేవ చేస్తేనే ఆమె ఆత్మ శాంతిస్తుందంటూ ఎప్పటిలాగే విధుల్లో మునిగిపోయారు. దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆయన విధుల్లో పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండటానికి ఆయన చేసిన త్యాగానికి పలువురు సెల్యూట్ చేస్తున్నారు.