ఆరాధ్య చనిపోలేదు... ఊరుకెళ్లింది

26 Nov, 2014 11:27 IST|Sakshi
ఆరాధ్య చనిపోలేదు... ఊరుకెళ్లింది

ఒంగోలు : ముద్దులు మూటగట్టే తన పాప దారుణ హత్యకు గురైందన్న వార్త విని ...ఆరాధ్య తల్లి సాహితి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఆరాధ్యా చనిపోలేదని... ఊరుకెళ్లిందంటూ ఆమె చెబుతున్న తీరు చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది. అప్పటివరకూ తమ మధ్యే ఆడుకున్న చిన్నారి ... ఇకలేదనే విషయాన్ని...ఆరాధ్య కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.  ఆరాధ్య బాబాయ్ లక్ష్మీనారాయణ ఎందుకిలా చేశాడో అంతు పట్టడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

ఈ ఘటనపై చిన్నారి తాతయ్య నాగేంద్రరావు మాట్లాడుతూ ఆరాధ్యను తన చిన్నల్లుడు ఎందుకు హతమార్చాడో అర్థం కావటం లేదన్నారు.  ఆరాధ్యను లక్ష్మీనారాయణ ముద్దు చేసేవాడని, ఎత్తుకుని ఆడించే వాడని అన్నారు. భార్యతో సన్నిహితంగా ఉండేందుకు పాప అడ్డుగా ఉందని చంపటం దారుణమన్నారు. ఇష్టం లేకుంటే వాళ్లు వేరే వెళ్లిపోతే సమస్య పరిష్కారం అయ్యేదని ఆయన అన్నారు.

అంతేకానీ పాపను చంపేంతగా కక్ష కడతాడనుకోలేదన్నారు.  ఏమి ఆశించి ఈ పని చేశాడో తెలియటం లేదన్నారు. అయితే తమ మధ్య ఎలాంటి కుటుంబ విభేదాలు లేవని అన్నారు. పాప కనిపించకపోవటంతో పోలీసులు అందర్ని విచారించారని, అయితే తన చిన్నల్లుడిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే తానే ఆరాధ్యను చంపేసినట్లు ఒప్పుకున్నాడని నాగేంద్రరావు తెలిపారు.  కాగా ఆరాధ్య పిన్ని సింధు..లక్ష్మీనారాయణ ప్రేమ వివాహం చేసుకున్నారు. ముందు పెద్దలకు ఇష్టం లేకపోయినా అనంతరం వారు అంగీకరించటంతో ...అందరూ కలిసే ఉంటున్నారు.

మరిన్ని వార్తలు