పుస్తకాలు, పెన్సిల్స్‌ దొంగిలిస్తున్నాడని దారుణం

25 Jul, 2019 09:06 IST|Sakshi
వరుణ్‌కుమార్‌ తొడపై  వాతలు.. గాయత్రికి కాలిపైన వాతలు పెట్టిన దృశ్యం  

పిల్లలపై తల్లి కర్కశత్వం .. అట్లకాడతో వాతలు

తమ్ముడు తప్పు చేస్తే.. అక్కకూ శిక్ష

అల్లిపురం (విశాఖ దక్షిణం): పిల్లలు తప్పు చేస్తే నయానో, భయానో దారికి తెచ్చుకోవాల్సిన తల్లి కర్కశంగా వ్యవహరించి వాతలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కేజీహెచ్‌లోని వన్‌ స్టాప్‌ సెంటర్‌ సిబ్బందికి విషయం తెలియటంతో తల్లికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, ప్లిలలకు వైద్యం అందజేస్తున్నారు. వన్‌ స్టాప్‌ సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం చినముషిడివాడ హైస్కూలులో గాయత్రి 4వ తరగతి, వరుణ్‌కుమార్‌ 3వ తరగతి చదువుతున్నారు. వరుణ్‌కుమార్‌ తోటి పిల్లల పుస్తకాలు, పెన్సిల్స్‌ దొంగిలిస్తున్నాడని పాఠశాల ఉపాధ్యాయుడు, విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో అతని తల్లి అట్లకాడతో వాతలు పెట్టింది.

తమ్ముడు తప్పు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావని గాయత్రికి కూడా కాళ్లపై వాతలు పెట్టింది. విషయం తెలుసుకున్న వన్‌ స్టాప్‌ సెంటర్‌ సిబ్బంది పిల్లలను పరామర్శించేందుకు బుధవారం స్కూల్‌కు వెళ్లారు. వారు స్కూలుకు రాలేదని టీచర్‌ చెప్పడంతో ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి తల్లిని, పిల్లలను కేజీహెచ్‌లోని వన్‌ స్టాప్‌ సెంటర్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పిల్లలిద్దరికీ పారా మెడికల్‌ వార్డులో వైద్యం అందించారు. స్కిన్‌ డాక్టర్‌ సూచన మేరకు పిల్లల వార్డులో చేర్పించి వైద్యం అందజేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు