‘మందకృష్ణ ఏపీలో అడుగుపెడితే తరిమికొడతాం’

13 Dec, 2019 20:43 IST|Sakshi

మంద కృష్ణ మాదిగ ఏపీలో తిరిగితే తరిమి కొడతారు

సాక్షి, అమరావతి: మాదిగలు జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆనందంగా ఉన్నారని.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే గుణపాఠం చెబుతామని  మందకృష్ణ మాదిగను బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.  శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. మంద కృష్ణ మాదిగ ఏపీలో తిరిగితే తరిమికొట్టే పరిస్ధితి ఉందని.. అందుకే ఏపీలో తిరగడం లేదని అన్నారు. సీఎం జగన్‌పై మందకృష్ణ వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు.  జాతిని అడ్డుపెట్టుకుని ఉద్యమాల ద్వారా మందకృష్ణ ఆర్థికంగా బలపడ్డారు.. కానీ ఉద్యమంలో పాల్గొన్న వారు పేదవారిలానే ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలకు బినామీగా మంద కృష్ణ వ్యవహరిస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు ఆర్థిక నేరస్ధుడని దళితుల భూములను ఆయన లాక్కుంటే అప్పుడు ఎక్కడికి వెళ్లారని మందకృష్ణను ఎంపీ ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు దిక్కుతోచని స్ధితిలో ఉంటే ఆయన చెంత చేరి దిక్కుమాలిన వాడిలా మారావని హేళన చేశారు. చంద్రబాబు జేబులో పెన్నులా.. ఆయన మాటలకు బినామిగా మందకృష్ణ మారారని తీవ్రస్థాయిలో  మండిపడ్డారు. చంద్రబాబు చేసిన పాపాల్లో మందకృష్ణకు భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ ఆశయసాధనలో జగన్‌మోహన్‌రెడ్డి పాలన అందిస్తున్నారని మెచ్చుకున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాల, మాదిగ, రెల్లి అనే మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ విషయంపై జగన్‌ను ఎందుకు ప్రశంసించరని ప్రశ్నించారు. టీడీపీ నాయకుల నోటి నుంచి వచ్చే మాటలే.. మీ నోటి నుంచి వస్తున్నాయని అన్నారు. 

పచ్చమీడియా ప్రోత్సాహకాలు తీసుకుని మంద కృష్ణ  విమర్శలు చేస్తున్నారని.. ఏపీలో మంద కృష్ణ తిరిగితే ప్రజలు చెప్పుతో కొడతారని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకరావు అన్నారు.మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మందకృష్ణకు ఏపీలో ప్రజలు మానసికంగా ఎప్పుడో ఉరి వేశారని ఎద్దేవా చేశారు. జాతిని అడ్డు పెట్టుకుని ఆర్థికంగా బలపడిన మందకృష్ణ, చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. 1994 ముందు మంద ఆర్థిక పరిస్థితి ఇప్పటి ఆర్థిక పరిస్థితికి పొంతన లేదన్నారు. మాదిగలకు పెద్ద పీట వేసి.. వెనుకబడ్డ ప్రతి కులాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రశంసించారు. చంద్రబాబు రాజకీయ అస్థిత్వం కోల్పోయినప్పుడల్లా మందకృష్ణ చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సూర్యుని మీద ఉమ్మేస్తే.. తిరిగి మనకే చేరుతుందన్నారు.  

మరిన్ని వార్తలు