వాణిజ్య శాఖ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి 

15 Sep, 2019 04:38 IST|Sakshi

బులెటిన్‌ విడుదల చేసిన లోక్‌సభ సెక్రటేరియట్‌ 

కమిటీల్లో అధిక సంఖ్యలో స్థానం దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు 

కీలకమైన ఆర్థిక శాఖ కమిటీ సభ్యులుగా మిథున్‌రెడ్డి, బాలశౌరి 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య శాఖ వ్యవహారాల పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ శనివారం బులెటిన్‌ విడుదల చేసింది. అత్యంత కీలకమైన ఈ కమిటీలో వివిద పార్టీలకు చెందిన 31 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. వాణిజ్య శాఖకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులు ఈ కమిటీ పరిశీలనకు వస్తాయి. ఆ బిల్లులను కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. బిల్లులో అవసరమైన మార్పులు, సలహాలతో సమగ్రమైన నివేదికను రూపొందిస్తుంది. ఆ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెడతారు. వాణిజ్య శాఖ పనితీరుపై వార్షిక నివేదికల పరిశీలనతో పాటు దీర్ఘకాలిక విధానాలపై ఈ కమిటీ సమీక్షిస్తుంది. ఈ కమిటీలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి(వైఎస్సార్‌సీపీ), కేశినేని నాని, తోట సీతారామలక్ష్మి(టీడీపీ), కేవీపీ రామచంద్రరావు (కాంగ్రెస్‌) సభ్యులుగా ఉన్నారు. 

మరికొన్ని కమిటీల ఏర్పాటు 
వాణిజ్య కమిటీతో పాటు ఇతర శాఖలకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ఆర్థిక, రక్షణ, వాణిజ్యం, విదేశీ వ్యవహారాలు, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి వంటి పలు కీలక శాఖల కమిటీల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చోటు దక్కించుకున్నారు. కీలకమైన ఆర్థిక వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా జయంత్‌ సిన్హా (బీజేపీ) నియమితులయ్యారు. సభ్యులుగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బాలశౌరి (వైఎస్సార్‌సీపీ), జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేష్‌ (బీజేపీ) తదితరులున్నారు. 
- హోం శాఖ వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీ :  చైర్మన్‌.. ఆనంద్‌శర్మ(కాంగ్రెస్‌), సభ్యులు.. వంగా గీత (వైఎస్సార్‌సీపీ) తదితర 31 మంది  
మానవ వనరుల అభివృద్ధి శాఖ వ్యవహారాల కమిటీ:  సభ్యులు.. లావు శ్రీకృష్ణదేవరాయలు(వైఎస్సార్‌సీపీ) తదితరులు  
పరిశ్రమలశాఖ వ్యవహారాల పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ :  చైర్మన్‌.. కె.కేశవరావు (టీఆర్‌ఎస్‌), సభ్యులు.. వైఎస్‌ అవినాశ్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) తదితరులు 
రవాణా, పర్యాటకం, సాంస్కృతిక శాఖ కమిటీ:  చైర్మన్‌.. టీజీ వెంకటేశ్‌(బీజేపీ), సభ్యులు.. గొడ్డేటి మాధవి(వైఎస్సార్‌సీపీ) తదితరులు 
ఐటీశాఖ కమిటీ : సభ్యులు.. ఎంవీవీ సత్యనారాయణ(వైఎస్సార్‌సీపీ), సుజనాచౌదరి (బీజేపీ) 
రక్షణశాఖ కమిటీ : సభ్యులు.. కోటగిరి శ్రీధర్‌ (వైఎస్సార్‌సీపీ) తదితరులు  
విదేశీ వ్యవహారాల కమిటీ: సభ్యులు.. మార్గాని భరత్‌ (వైఎస్సార్‌సీపీ), గల్లా జయదేవ్‌ (టీడీపీ)  
పట్టణాభివృద్ధి శాఖ కమిటీ: సభ్యులు.. ఆదాల ప్రభాకర్‌రెడ్డి(వైఎస్సార్‌సీపీ), సుజనా చౌదరి (బీజేపీ)  
నీటి వనరుల శాఖ కమిటీ:  సభ్యులు.. గోరంట్ల మాధవ్‌(వైఎస్సార్‌సీపీ) తదితరులు 
- గ్రామీణాభివృద్ధిశాఖ కమిటీ:  సభ్యులు.. తలారి రంగయ్య(వైఎస్సార్‌సీపీ), రామ్మోహన్‌నాయుడు(టీడీపీ) 
బొగ్గు, ఉక్కుశాఖ కమిటీ : సభ్యులు.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డా.వెంకటసత్యవతి, రఘురామకృష్ణంరాజు(వైఎస్సార్‌సీపీ) తదితరులు 
సామాజిక న్యాయ శాఖ కమిటీ: సభ్యులు.. దుర్గాప్రసాద్‌(వైఎస్సార్‌సీపీ) 
పెట్రోలియం, సహజ వాయువులశాఖ కమిటీ: సభ్యులు.. కనకమేడల రవీంద్రకుమార్‌

మరిన్ని వార్తలు