ఆరు నెలలుగా జీతాల్లేవు..!

25 May, 2015 00:33 IST|Sakshi

ఆందోళన చెందుతున్న ఎంటీఎస్
  తమ చేతిలో లేదంటున్న అధికారులు
  పట్టించుకోని ప్రభుత్వం
 
 శ్రీకాకుళం న్యూకాలనీ: ఎంటీఎస్(మినిమమ్ టైమ్ స్కేల్) ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతం పడకపోతే నానా హైరానా పడతారని, అలాంటిది ఆరునెలలుగా జీతాలు లేకుండా పనిచేస్తున్నా పట్టించుకునే అధికారులే కరువయ్యారని కాం ట్రాక్టు అధ్యాపకులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో నిరుద్యోగులు వందల సంఖ్యలో కాంట్రాక్టు బేసిక్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి డిసెండర్ నుం చి ఇంతవరకు జీతాలు చెల్లించలేదు. అంతకు ముందు ట్రెజరీల్లో 01 పేరిట ప్రభుత్వం జీతాలను చెల్లిస్తూ వచ్చింది. అయితే, వీరిని తాత్కాలికంగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో 022 పద్దు కింద జీతాలు చెల్లించాల్సి ఉంది. అందుకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. సంబంధిత శాఖల కమీషనర్ల నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం కాలయాపన చేస్తుండడం తో చిరు ఉద్యోగులు కుటుంబపోషణకు సతమతమవుతున్నారు. అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయమై జిల్లా ఇంటర్మీడియెట్ విద్య వృత్తివిద్యాధికారి పాత్రుని పాపారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఎంటీఎస్ ఉద్యోగులకు జీతాలు రాని మాట వాస్తవమేనని అంగీకరించారు. వారి జీతాలకు సంబంధించిన పద్దు మారిందని, అది తమ చేతిలో లేద న్నారు. కమిషనర్ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉందన్నారు.
 

మరిన్ని వార్తలు