'గాలి మీ వైపే ఉంటే.. ముందస్తుకు వెళ్లండి'

4 Sep, 2017 11:52 IST|Sakshi
'గాలి మీ వైపే ఉంటే.. ముందస్తుకు వెళ్లండి'

సాక్షి, కిర్లంపూడి: ప్రత్యేక హోదా ఎలాంటి హామీనో.. కాపులను బీసీల్లో చేర్చడం కూడా అలాంటి వాగ్దానమేనని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. '2004 నుంచి 2014 వరకు దాదాపు 40 ఉప ఎన్నికలు జరిగితే ఏ ఎన్నికల్లోనూ టీడీపీ గెలువలేదు. చాలాచోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. అంతమాత్రాన టీడీపీని మూసేశారా' అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు అక్రమ పద్ధతుల్లో టీడీపీ గెలిచిందని విమర్శించారు. వాతావరణం తమకే అనుకూలంగా ఉందని టీడీపీ భావిస్తే.. ముందస్తు ఎన్నికలకు సిద్ధపడాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీలో ఉన్న కాపు మంత్రులు, నేతలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

గాలి టీడీపీ వైపే ఉందని ముఖ్యమంత్రి అంటున్నారు
వాతావరణం మీకే బాగున్నప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి
2050 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలని చంద్రబాబు, ఆయన కొడుకు తహతహలాడుతున్నారు
మా ఉద్యమాన్ని మూసేయాలని సీఎం చెప్పిస్తున్నారు
తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు, ఎంపీలు రాజీనామా చేశారు. రాజీనామాలు చేసి అన్నిచోట్లా గెలుపొందలేదు. గెలుపొందకపోయినా ఇచ్చిన హామీ ప్రకారం సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు.
ఉద్యమకాలంలో వూహాత్మక మౌనం పాటిస్తే.. ముద్రగడను కోనేశామని విషప్రచారం చేస్తున్నారు
హామీలను నెరవేర్చాలని రోడ్డెక్కితే ముద్రగడ అమ్ముడుపోయాడని అంటున్నారు
మేం, మా జాతి అమ్ముడయిపోయే జాతా? అణకు ఆరుగురు కాపులు అమ్ముడుపోతున్నారా?
ముఖ్యమంత్రి దిగజారి మాటలు మాట్లాడుతున్నారు