'నాన్నను ఉగ్రవాదిలా చూస్తున్నారు'

12 Jun, 2016 20:22 IST|Sakshi

- అమ్మకు వెన్నెముక సమస్య ఉంది.. ఈడ్చుకెళ్లి వ్యాన్‌లో పడేశారు
- తమ్ముడి బట్టలు చించేసి ఈడ్చుకుపోయారు
- అన్ని చానళ్లలో వచ్చినా హోంమంత్రి బుకాయింపు
- ముద్రగడ పద్మనాభం పెద్ద కుమారుడు బాలు ఆవేదన


రాజమహేంద్రవరం : 'ప్రభుత్వం నాన్నను ఉగ్రవాదిగా చూస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని దీక్ష చేస్తున్నప్పుడు వందలాది మంది పోలీసులు ఇంట్లోకి చొరబడి బలవంతంగా ఎత్తుకెళ్లారు. అమ్మ వెన్నెముక సమస్యతో బాధపడుతున్నా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనంలో పడేశారు. తమ్ముడిని దుస్తులు చించివేసి కొట్టారు. అయినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా దీక్ష కొనసాగుతుంది' అని కాపునేత ముద్రగడ పద్మనాభం పెద్దకుమారుడు బాలు స్పష్టం చేశారు.

ఆదివారం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి ఎదుట విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి ప్రాణానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమను కొట్టడం అన్ని టీవీ చానెళ్లలో ప్రసారమయ్యిందని, అయినా అలా జరగలేదని హోంమంత్రి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులను మోహరించి ఆంక్షల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఆస్పత్రి వద్ద బారికేడ్లు పెట్టి రోగులను ఇక్కట్లకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కాపులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు