ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు

15 Dec, 2019 04:10 IST|Sakshi

కమిటీ నివేదిక వచ్చాక రాజధానిపై పూర్తి స్పష్టత

మంత్రి బొత్స సత్యనారాయణ  

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. విశాఖలోని ప్రభుత్వ అతిథిగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధానిపై స్పష్టత కోసం కమిటీ వేశామని, ఆ కమిటీ నివేదిక ఇచా్చక రాజధానిపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం వరకు ఉన్న పరిస్థితిని మాత్రమే శాసన మండలిలో చెప్పటం జరిగిందన్నారు.

రాజధాని విషయంలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని తెలిపారు. అమరావతిలో భవనాల నిర్మాణాలు ఏ దశలో ఉన్నా వాటిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని ఆయన చెప్పారు. 55 శాతం నిర్మాణం పూర్తయిన వాటిని వీలైనంతా వేగంగా పూర్తి చేస్తామన్నారు. టీడీపీ వాళ్లు అసెంబ్లీలో దుర్బాషలాడుతూ సభను సజావుగా జరగనివ్వడం లేదని మంత్రి తప్పుపట్టారు. విశాఖ మెట్రోను రెండు దశలుగా చేపట్టాలని నిర్ణయించామని, భోగాపురం ఎయిర్‌పోర్టు విషయమై మరోసారి టెండరుకు వెళ్లాలనే విషయంపై ఆలోచిస్తున్నామని మంత్రి చెప్పారు.

మరిన్ని వార్తలు