డిసెంబర్‌లో మున్సిపల్‌ ఎన్నికలు! : మంత్రి బొత్స

12 Sep, 2019 13:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకుచ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. గురువారం విజయవాడలో మున్సిపల్‌ కమిషనర్‌ల వర్క్‌షాప్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన బొత్స మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒకేసారి నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయలేదని, జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తున్నారని గుర్తు చేశారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చాలా మంది అధికారులు ప్రజలు ఫోన్‌ చేస్తే ఫోన్‌ ఎత్తట్లేదని, స్పందన కార్యక్రమంపై అధికారులు రాజీ పడడానికి వీల్లేదన్నారు.

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి డ్రైనేజీ వ్యవస్థ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణాల్లో నీటి కొరత రాకుండా చూడాల్సిన అవసరముందన్నారు. వచ్చే ఉగాదికి ఇళ్ల పట్టాలివ్వాలని సీఎం నిర్ణయించినందున ఈ కార్యక్రమం కోసం వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయం అధికారుల సేవలను మున్సిపల్‌ అధికారులు వినియోగించుకోవాలన్నారు. చాలామంది కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయమని అడుగుతున్నారనీ, ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు డిసెంబర్‌లో మున్సిపల్‌ ఎన్నికలు వచ్చే అవకాశముందని బొత్స పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు మున్పిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు