జగన్‌పై హత్యాయత్నం: రెండోరోజు సిట్‌ విచారణ

29 Oct, 2018 18:17 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ రెండోరోజూ కొనసాగింది. నిందితుడు శ్రీనివాస్‌ను సిట్‌ అధికారులు విచారించారు. అతనితోపాటు రమాదేవి, రేవతీపతి, విజయదుర్గను కూడా అధికారులు విచారించారు. నిందితుడి కాల్ డేటానుబట్టి సమాచారాన్ని రాబట్టే యత్నం చేశారు. నిందితుడి టాబ్‌లోని సమాచారాన్ని కూడా పోలీసులు రాబడుతున్నారు. రెండోరోజు ముగ్గుర్ని మాత్రమే సిట్ అధికారులు అదనంగా విచారించారు. ఇక, జనవరిలోనే ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తి తీసుకొచ్చినట్టు గుర్తించారు. అప్పటినుంచి టీడీపీ నేత హర్షవర్ధన్‌ హోటల్‌లోనే కత్తి ఉంది. హత్యాయత్నం జరిగిన రోజు హోటల్‌ నుంచే నిందితుడు కత్తి తీసుకొచ్చాడని నిర్దారించారు. మరోవైపు శ్రీనివాస్‌కు చెందిన  విజయా బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, స్టేట్‌బ్యాంకు ఖాతాల్లోని లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. లంకలో కోటి రూపాయల విలువచేసే భూమి కొనుగోలు చేసేందుకు శ్రీనివాస్‌ బేరమాడినట్టు గుర్తించారు. భూముల లావాదేవీలపై ఆరా తీస్తున్న పోలీసులు కుట్రకోణంపై మాత్రం దృష్టిపెట్టడం లేదు.


సీసీ కెమెరాల దృశ్యాల పరిశీలన..
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఎయిర్‌పోర్ట్‌లోని సీసీ కెమెరాల దృశ్యాలను సిట్‌ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లోని 32 కెమెరాల ఫుటేజీని 4 హార్డ్‌ డిస్క్‌లలోకి సేకరించారు పోలీసులు. ఘటన జరిగిన ప్రాంతంలో మాత్రం సీసీ కెమెరాలు లేవు. నిందితుడు శ్రీనివాస్‌ కదలికలపై సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. సీఐఎస్‌ఎఫ్, పోలీస్ సిబ్బందితో శ్రీనివాస్ చనువుగా మెలిగినట్టు గుర్తించారు. విచారణలో భాగంగా కర్నూల్‌కు బదిలీ అయిన ఫకీరప్పకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. పోలీసులు నిందితుడి కాల్‌ డేటాను విచారిస్తున్నారు. 9 ఫోన్లు మార్చిన శ్రీనివాస్ 10వేల ఫోన్ కాల్స్, 397 ఫోన్‌ నెంబర్లతో మాట్లాడినట్టు గుర్తించారు. కొంతమందితో తరుచూ మాట్లాడినట్టు గుర్తించిన పోలీసులు అదే క్యాంటీన్‌లో పనిచేస్తున్న ముగ్గురిని పిలిచి విచారించారు.

మరిన్ని వార్తలు