చేతులు కట్టి.. చెట్టుకు ఉరివేసి..

10 Jan, 2014 23:51 IST|Sakshi

 చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్ :  చేతులు కట్టేసి చెట్టుకు ఉరేసి వ్యక్తిని హతమార్చిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం సంచలనం రేపింది. పోలీసుల కథనం మేరకు.. స్థానిక యాచకుల గల్లిలో నివాసముండే తూర్పటి చెన్నయ్య (38) కుటుంబం గతంలో భిక్షాటన చేసేది. ప్రస్తుతం వ్యవసాయ పొలాల్లో ఎలుకలు పట్టి వాటిని విక్రయిస్తూ చెన్నయ్య కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉండ గా.. మండలంలోని ధరిపల్లి శివారులో చెన్నయ్యతో పా టు సుదర్శన్‌లు వ్యవసాయ పొలంలో ఎలుకల కోసం గుంతలు తవ్వగా అందులో బంగారం దొరికింది. ఈ ఘటనలో మార్చి 2న చెన్నయ్యతో పాటు సుదర్శన్‌లపై పోలీస్‌లు కేసు నమోదు చేశారు. కేసు నిమిత్తం చెన్న య్య తన చిన్నాన్న దుర్గయ్య కొంత మొత్తాన్ని అప్పు చేశాడు.

అయితే చేసిన రుణాన్ని తీర్చలేకపోయాడు. దీంతో అప్పు ఇచ్చి చిన్నాన్న.. చెన్నయ్య ఇంటిని తన పేరుతో రాయించుకున్నాడు. అంతేగాక ఇంట్లోని పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నాడు. కాగా చెన్నయ్య భార్య నర్సవ్వ సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో నెల రోజుల క్రితం ఆమె పుట్టినిల్లు అయిన నిజామాబాద్ జిల్లా బిక్కనూరుకు పిల్లలతో సహా వెళ్లింది. చెన్నయ్య కూడా బుధవారం భార్య వద్ద వెళ్లాడు. అప్పు కట్టనందుకు చిన్నాన్న దుర్గయ్య ఇంటిని రాయించుకున్నాడని, దీనికి తోడు పలు సామాను కూడా స్వాధీన పరుచుకున్నాడని భార్యకు తెలిపాడు.

అయితే బిక్కనూరుకు వచ్చేయాలని భార్య భర్తను కోరింది. చిన్నశంకరంపేటకు పోయి మిగిలి ఉన్న సామగ్రి తీసుకుని శుక్రవారం ఇక్కడికి వచ్చేస్తానని భార్యకు చెప్పి బయలుదేరాడు. గురువారం రాత్రి తన ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న చెన్నయ్య మెడపై దుండగులు తాడుతో బిగించి ఉపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరేశారు. ఈ ఘటనపై పలు అనుమానాలు ఉండడంతో సంగారెడ్డి క్లూస్ టీం కూడా వచ్చి వివరాలను సేకరించింది. రామాయంపేట సీఐ గంగాధర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య నర్సవ్వ, పదేళ్ల లోపు ఇద్దరు కుమార్తెలు శ్యామల, సరళ, కుమారుడు సాగర్ ఉన్నారు. ఇదిలా ఉండగా.. చెన్నయ్య శుక్రవారం ఓ కేసు నిమిత్తం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అంతలోనే హత్యకు గురయ్యాడు.

మరిన్ని వార్తలు