ప్రసాద్రెడ్డి హత్య జరిగిన తీరు ఇలా...

29 Apr, 2015 18:28 IST|Sakshi
ప్రసాద్రెడ్డి హత్య జరిగిన తీరు ఇలా...

అనంతపురం (రాప్తాడు): అనంతపురం జిల్లా రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఉదయం వైఎస్ఆర్సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ప్రసాద్ రెడ్డిని దుండగులు హత్యచేసిన తీరు ఇలా ఉంది..

ప్రసాద్రెడ్డిని బుధవారం ఉదయం 11 గంటల 40 నిమిషాలకు తహసీల్దార్ కార్యాలయంలో దుండుగులు హత్య చేశారు. ప్రసాద్ రెడ్డిని పథకం ప్ర్రకారమే హత్య చేసేందుకు దుండగులు పూనుకున్నట్టు ఈ హత్య జరిగిన తీరుతో స్పష్టమవుతోంది. అందులో భాగంగానే... అనుకున్నట్టుగా తహసీల్దార్ కార్యాలయంలోకి దుండగులు ప్రవేశించారు. ప్రసాద్ రెడ్డి కంప్యూటర్ రూంలోకి వెళ్లగానే దుండగులు తలుపులన్నీ మూసేశారు. దాంతో భయపడిపోయిన తహసీల్దార్, ఇతర ఉద్యోగులు వెంటనే బయటకు పారిపోయారు. ప్రసాద్రెడ్డిపై మూకుమ్మడిగా 10 మంది దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసి, అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఇంతలో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి రావడంతో దుండగులు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. దుండగులంతా బైకులపై వచ్చి ప్రసాద్రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. అయితే పథకం ప్రకారమే ముందుగా వేటకొడవళ్లను తహసీల్దార్ కార్యాలయంలో దాచిపెట్టినట్టుగా సమాచారం.

ఈ హత్యకేసులో రాప్తాడు ఎస్ఐ నాగేంద్రప్రసాద్ పాత్ర ఉండొచ్చని ప్రసాద్ రెడ్డి అనుచరులు అరోపిస్తున్నారు. ప్రసాద్ రెడ్డి మృతదేహం వద్ద నాగేంద్రప్రసాద్ నేమ్ బ్యాడ్జి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి.  ఇదిలా ఉండగా, ప్రసాద్ రెడ్డి హత్య వెనుక మంత్రి పరిటాల సునీత హస్తముందని ప్రసాద్ రెడ్డి సోదరుడు మహానందరెడ్డి ఆరోపించారు. మంత్రి సునీత సోదరుడు మురళి, కుమారుడు శ్రీరాంల హస్తం ఉందని ఆరోపణలు వెలువెత్తున్నాయి. కొన్నిరోజులుగా ఎస్ఐ నాగేంద్రప్రసాద్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారంటూ మహానందరెడ్డి ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు