రాప్తాడులో సర్కారీ వేట!

30 Apr, 2015 03:07 IST|Sakshi

‘అనంత’లో తహసీల్దార్ ఆఫీస్‌లోనే వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య
పోలీస్‌స్టేషన్‌కు పక్కనే పథకం ప్రకారం ఘాతుకం
ఘటనాస్థలంలో రాప్తాడు ఎస్‌ఐ నేమ్‌బ్యాడ్జీ లభ్యం
మంత్రి పరిటాల సునీత కుటుంబీకులు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాత్రపై అనుమానాలు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం మరోసారి రక్తసిక్తమైంది. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాప్తాడు మండల నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి(49)పై రాజకీయ ప్రత్యర్థులు వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి నరికి చంపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలోని ఆర్‌ఐ చాంబర్‌లోనే ప్రసాదరెడ్డి ఉసురు తీశారు. సాక్షాత్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో జరిగిన ఈ ఘటన వెనుక ప్రభుత్వంలోని పెద్దల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది.

హత్య జరిగిన ప్రాంతం రెవెన్యూ కార్యాలయంలోని ఆర్‌ఐ చాంబర్ కావడం, అక్కడి బీరువాలోనే హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లను దాచి ఉంచడం, ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉండడం, ఘటనా ప్రాంతంలో ఆ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్.ఐ.నాగేంద్రప్రసాద్ నేమ్ బ్యాడ్జి లభ్యం కావడం, హత్య జరిగిన సమయంలో పోలీస్ స్టేషన్‌లో అధికారులు సహా సిబ్బంది ఉండడం, అయినా ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా హత్య చేయడం వంటి పరిణామాలు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ దారుణం జరిగిందనడానికి ప్రత్యక్ష నిదర్శనా లుగా కనిపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వమే ఈ హత్యను చేయించిందని వైఎస్సార్ సీపీ నేతలు ముక్తకంఠంతో పేర్కొన్నారు.  

జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనతో ప్రసాదరెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని సామగ్రిని ధ్వంసం చేసి.. నిప్పుపెట్టారు. మరోపక్క ప్రసాదరెడ్డి హత్యతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరైంది. మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్, పరిటాల మురళిల అండతోనే హత్య జరిగిందని విరుచుకుపడ్డారు.  
 
పక్కా ప్రణాళికతో.. మూడు నిమిషాల్లోనే..
రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి గ్రామ సర్పంచ్ సావిత్రి భర్త ప్రసాదరెడ్డి వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్‌గా గతంలో బాధ్యతలు నిర్వర్తించారు. వ్యక్తిగత పని నిమిత్తం ఇటీవల మండల కేంద్రానికి వస్తూ వెళ్తుండేవారు. ప్రత్యర్థులు దీనిని అవకాశంగా తీసుకుని హత్యకు కుట్ర పన్నారు. ఈ క్రమంలో ప్రసాదరెడ్డిని తహశీల్దార్, ఆర్‌ఐలే బుధవారం పని ఉందంటూ ఫోన్ చేసి పిలవడంతో మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రసాదరెడ్డి తన అనుచరుడు శివయాదవ్‌తో కలసి రాప్తాడు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు.అప్పటికే 8 మంది ప్రత్యర్థులు అక్కడ మాటు వేసి ఉన్నారు.

ప్రసాదరెడ్డి ఆర్‌ఐ దివాకర్ గదిలోకి వెళ్లి కూర్చున్నారు. ఇంతలోనే రెప్పపాటు కాలంలో ప్రత్యర్థులు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొరబడి, శివయాదవ్‌ను కంప్యూటర్ గదిలోకితోసి తలుపులు మూసి, ఆర్‌ఐ చాంబర్ లోపల గడియపెట్టి ప్రసాదరెడ్డిపై వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు. మెడపై విచక్షణా రహితంగా నరికారు. చేతిని తెగ్గొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెవెన్యూ కార్యాలయ సిబ్బంది సాక్షిగా మూడు నాలుగు నిమిషాల్లోనే ఈ ఘాతుకం జరిగిపోయింది. ప్రసాదరెడ్డికి భార్య, కుమారుడు రమణారెడ్డి ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
 
పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాత్రపై అనుమానం

హత్యకు పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది సహకరించారని ప్రసాదరెడ్డి సోదరుడు మహానందరెడ్డి ఆరోపించారు. నాగేంద్రప్రసాద్ ఇటీవల పరిటాల సునీత సొంత మండలం రామగిరి నుంచి రాప్తాడుకు బదిలీ అయ్యారు. ప్రసాదరెడ్డి హత్య కుట్రలో భాగంగానే నాగేంద్రప్రసాద్‌ను ఇక్కడికి బదిలీ చేయిం చినట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
 
ఘటన స్థలంలో ఎస్‌ఐ నేమ్‌బ్యాడ్జి
ప్రసాదరెడ్డి హత్య జరిగిన ప్రదేశంలో రాప్తాడు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ నేమ్‌బ్యాడ్జీ దొరికింది. నేమ్‌బ్యాడ్జీ ఊడిపోయి ఉందంటే తోపులాట లేదా ఘర్షణ జరిగి ఉండాలని, అంటే ఎస్‌ఐ కూడా హత్య జరిగిన సందర్భంలో ఘటనా స్థలంలో ఉన్నట్లేనని బంధువులు ఆరోపిస్తున్నారు.ఈయన టీడీపీ వారికి సహకరిస్తూ.. వైఎస్సార్‌సీపీ వారి పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తుంటారనే విమర్శలున్నాయి. కాగా, ఇటీవల పెద్దవడుగూరు మండలం కిష్టిపాడులో సింగిల్‌విండో అధ్యక్షుడు విజయభాస్కరరెడ్డిని సొసైటీ కార్యాలయంలోనే ప్రత్యర్థులు హత్యచేశారు. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది.
 
ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ప్రసాదరెడ్డి మృతదేహాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు తీసుకెళ్లేందుకు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. ఎస్పీ కార్యాలయం సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. మరోదారి గుండా వెళ్లాలని సూచించారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్పీ రాజశేఖరబాబు  వచ్చి 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని ప్రసాదరెడ్డి నివాసానికి తీసుకెళ్లారు.
 
రాప్తాడులో తీవ్ర ఉద్రిక్తత
హత్య సమాచారం తెలిసిన వెంటనే ప్రసాదరెడ్డి బంధువులు, అనుచరులు రాప్తాడుకి చేరుకుని ఆర్‌ఐ చాంబర్‌లో రక్తపు మడుగులో పడివున్న ప్రసాద్‌రెడ్డి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఆయన అనుచరులు ఆవేశానికిగురై.. తహశీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల్లోని సామగ్రిని ధ్వంసం చేసి.. నిప్పంటించారు. సీఎం చంద్రబాబు చిత్రపటాలకు నిప్పంటించారు. ప్రసాదరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తీసుకెళ్లేందుకు యత్నించగా.. అనుచరులు అడ్డుపడ్డారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ రాజశేఖరబాబు.. మహానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో చర్చించి మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
పాతకక్షలతోనే హత్య: డీఐజీ
పాత కక్షల నేపథ్యంలోనే ప్రసాద్‌రెడ్డి హత్య జరిగిందని డీఐజీ బాలకృష్ణ చెప్పారు. బుధవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. 2003లో రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో జరిగిన ఉప్పర చలపతితో పాటు మరో ఇద్దరి హత్య కేసులో ప్రసాద్‌రెడ్డి, ఆయన సోదరుడు మహానందరెడ్డితో పాటు గోపాల్‌రెడ్డి నిందితులన్నారు. కాగా, ప్రసాదరెడ్డి హత్య కేసులో నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు.
 
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: వైఎస్సార్ సీపీ నేతలు
ప్రసాదరెడ్డిది రాజకీయహత్య అని, పథకం ప్రకారమే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హత్యకు సహకరించారని, మంత్రి పరిటాల సునీతతో పాటు పరిటాల మురళి, శ్రీరామ్ పాత్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాంలు ప్రభుత్వాస్పత్రిలో ప్రసాద్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రసాదరెడ్డి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు