జానీమూన్‌కు కిరీటం

6 Jul, 2014 00:19 IST|Sakshi
జానీమూన్‌కు కిరీటం

సాక్షి,గుంటూరు: జిల్లా పరిషత్  చైర్‌పర్సన్‌గా తొలి సారి ముస్లిం మహిళ ఎన్నికయ్యారు. కాకుమాను జెడ్పీటీసీ సభ్యురాలు షేక్ జానీమూన్‌ను జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్‌గా తాడికొండ జెడ్పీటీసీ సభ్యుడు వడ్లపూడి పూర్ణచంద్రరావు ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారి అయిన కలెక్టర్ సురేశ్‌కుమార్ నుంచి చైర్‌పర్సన్ జానీ మూన్ జెడ్పీ బాధ్యతలు స్వీకరించడంతో నూతన పాలకవర్గం కొలువు దీరినట్టయింది.
 
 ఎన్నిక జరిగిందిలా...
 జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు శనివారం అట్టహాసంగా జరి గాయి.
 తొలుత ఉదయం 10 గంటలకు  ప్రిసైడింగ్ అధికారి సురేశ్‌కుమార్ ఇద్దరు కోప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు.
 
 అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌గా జానీమూన్, వైస్‌చైర్మన్‌గా వడ్లపూడి పూర్ణచంద్రరావులు తమ నామినేషన్లు దాఖలు చేశారు.
 
 మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ప్రిసైడింగ్ అధికారి అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
 
 తొలుత చేబ్రోలు జెడ్పీటీసీ సభ్యురాలు అత్తోట సుధారాణి, చివరగా దుర్గి జెడ్పీటీసీ సభ్యురాలు కొనకంచి హైమావతి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ విధంగా మొత్తం 57 మంది జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం పూర్తయింది.
 
 10 మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకార పత్రం చదవలేకపోయారు.
 అమృతలూరు జెడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ పృథ్వీలత ఇంగ్లిషులో ప్రమాణస్వీకారం చేశారు.
 అజెండాలో రెండవ అంశంగా ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక చేపట్టారు.
 
 ఈ రెండు స్థానాలకు నక్కా సువర్ణరాజు ( బాపట్ల), రాజేష్ కుమార్ (మాచర్ల) ఇద్దరే నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యా హ్నాం మూడు గంటలకు చైర్మన్ ఎన్నిక జరుగుతుందనిప్రకటించి సమావేశాన్ని వాయిదా వేశారు.
 
 తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రిసైడింగ్ అధికారి సురేష్‌కుమార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ స్థానానికి, వైస్ చైర్మన్ స్థానానికి ఒక్కొక్క నామినేషన్ మాత్రమే వచ్చినట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ జానీమూన్‌ను జెడ్పీటీసీ సభ్యురాలు పృథ్వీలత ప్రతిపాదించగా, మేకా శివరామకృష్ణ బలపరిచారు. వైస్‌చైర్మన్ వడ్లపూడి పూర్ణచంద్రరావును కె.శ్రీనివాసరావు ప్రతిపాదించగా, సాయిబాబా బలపరిచారు. వెంటనే వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.
 
 అనంతరం షేక్ జానీమూన్‌తో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు ఆమెకు అప్పజెబుతున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఆ తరువాత వైస్ చైర్మన్ వడ్లపూడి పూర్ణచంద్రరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు.
 
 ఈ కార్యక్రమంలో  ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొని నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.
 
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 23 మంది చైర్‌పర్సన్ ఎన్నికకు గైర్హాజరయ్యారు.
 జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే),కోన రఘుపతి పాల్గొన్నారు.  
 
 ఈ సమావేశంలోనే కేంద్ర సర్వీసులోకి వెళుతున్న జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్‌ను సన్మానించారు.
 
 ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు తెనా లి శ్రావణకుమార్, అనగాని సత్యప్రకాష్, దూళిపాళ్ల నరేంద్ర,ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాస్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్,ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, డీసీసీ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య తదితరులు ప్రసంగించారు.
 
 జెడ్పీ సీఈఓ సుబ్బారావు ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించారు. అర్బన్ ఎస్పీ జెట్టి గోపినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
 

>
మరిన్ని వార్తలు