క్రికెట్‌ సవాల్‌ మొదలు

2 Dec, 2018 11:56 IST|Sakshi

వేడుకగా మొదలైన ఎంవీవీ టీ10 చాంపియన్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ

భీమిలి అంచె పోటీలను

ప్రారంభించిన వైఎస్సార్‌సీపీ నేత బొత్స

సాధనతో శిఖరాలకు చేరాలని గ్రామీణ క్రీడాకారులకు పిలుపు

ఉత్సాహంగా పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు 

విశాఖ స్పోర్ట్స్‌ : గ్రామీణ క్రీడాకారులకు గట్టి సవాలు విసిరి, ఉత్తేజకరమైన బహుమతులను అందించి ప్రోత్సహించే ప్రతిష్టాత్మక ఎంవీవీ టీ10 చాంపియన్స్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ ఉత్సాహకర వాతావరణంలో మొదలైంది. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులలోని జట్లు హోరాహోరీగా తలపడి, వాటిలోని అత్యుత్తమ జట్లు తుది అంచెలో ఢీకొనే ఈ టోర్నీలో.. భీమిలి అంచె పోటీలను వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ శనివారం నగర శివార్లలోని సాంకేతిక ఇంజినీరింగ్‌ కళాశాల గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నిరంతర సాధనతో సామర్ధ్యాన్ని మె రుగు పరుచుకోవాలని, అలా ఉన్నత స్థాయికి చేరుకోవాలని గ్రామీణ క్రీడాకారులకు పిలుపునిచ్చారు.అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకుని క్రీడాకారులుగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు.  ఎంవీవీ చాంపియన్‌లీగ్‌ రాజకీయ కార్యక్రమం కాదని నియోజకవర్గంలో క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించడానికేనని అన్నారు. 

తొలుత వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో నలభై జట్లు పోటీపడుతున్నాయని వాటిలో ఫైనల్స్‌ ఆడిన రెండు జట్లకు పార్లమెంట్‌ నియోజకవర్గ లీగ్‌ పోటీలకు అర్హత కల్పించనున్నారని తెలి పారు.  వైఎస్సార్‌సీపీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు తైనాల విజయకుమార్‌ మా ట్లాడుతూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ పోటీలను నిర్వహిస్తున్నారని ప్రతీ సెగ్మెంట్‌ పోటీలలో తొలిరెండు స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్స్‌ లీగ్‌కు అర్హత సాధిస్తారని తెలిపారు. పార్టీ సీనియర్‌ నాయకుడు కొడాలి నాని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వచ్చేందుకు ఇలాంటి పోటీల వల్ల ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

 తొలుత పోటీల నిర్వాహక కమిటీ చైర్మన్, విశాఖ పార్లమెంట్‌ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ జనవరి ఐదునుంచి పదోతేదీవరకు సెమీస్, ఫైనల్స్‌ పోటీలు విశాఖలోని పోర్ట్‌ స్టేడియంలో జరగనున్నాయన్నారు.  తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ. 2 లక్షల ప్రోత్సాహక బహుమతులు అందచేయనున్నామన్నారు. బొత్స సత్యన్నారాయణ గాల్లోకి బెలూన్లను విడిచి పోటీలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.  అనంతరం బొత్స బ్యాటింగ్‌ చేయగా కొడాలి నాని బౌలింగ్‌ చేసారు. మళ్ల వికెట్‌ కీపింగ్‌ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.  పోటీల ప్రారంభంలో పార్టీ నాయకులు దివంగత సీఎం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

టీడీపీ పాలనకు అంతిమ ఘడియలు
పీఎంపాలెం (భీమిలి): రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచడంలో విఫలమైన టీడీపీ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు దాపురించాయని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. చాంపియన్‌ లీగ్‌ టీ10 క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీపై విమర్శలు సంధించా రు. కల్లబొల్లి మాటలు చెప్పి అందలమెక్కి ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచడంలో విఫలమైన సీఎం చంద్రబాబును రాష్ట్ర ప్రజలు క్షమిం చరన్నారు.హుందాతనానికి మారుపేరైన జననేత జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వం పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు.టీడీపీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈ ప్రభంజనాన్ని నిలువరించడం అసాధ్యమన్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రజా వంచన తప్ప చేసిందేమీ లేదని బొత్స విమర్శించారు.

 నిరుద్యోగ భృతి పేరుతో లక్షలాది మంది నిరుద్యోగులను చంద్రబాబు నిలువునా మోసం చేసారని విమర్శించారు.రానున్న ఎన్నికలలో  టీడీపీ గట్టిగా బుద్ధి చెప్పాలని యువతకు పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, నగర పరిధిలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, కేకే రాజు, తిప్పల నాగిరెడ్డి, డాక్టర్‌ పీవీ రమణమూర్తి, ఎస్‌కోట నియోజకవర్గం సమన్వయ కర్త కడుబండ శ్రీనివాసరావు, అక్కరమాని వెంకటరావు, గాదె రోశిరెడ్డి, పోతిన శ్రీనివాసరావు, స్థానిక నాయకులు జెఎస్‌ రెడ్డి, గుమ్మడి మధు, వంకాయల మారుతీ ప్రసాద్, గరికిన గౌరి, మల్లువలస జగదీశ్వరరావు  అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన  నాయకులు లభిమానులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు