29న వైఎస్సార్‌సీపీలోకి కాటసాని

26 Apr, 2018 06:56 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

300 వాహనాల్లో బయలుదేరుతున్నట్లు వెల్లడి

కర్నూలు (టౌన్‌) :  మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం సాయంత్రం స్థానిక కల్లూరులోని  స్వగృహంలో విలేకరులకు వెల్లడించారు. ‘పాణ్యం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నాలుగైదు సార్లు సమావేశాలు నిర్వహించా. బీజేపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరాలంటూ అందరూ ముక్తకంఠంతో ఒత్తిడి తెచ్చారు. వారి మనోభావాలు, అభీష్టం మేరకు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా’నని ప్రకటించారు. ఈ నెల 29వ తేదీన 300 వాహనాల్లో బయలుదేరుతున్నట్లు తెలిపారు.

గుడివాడ –పామర్రు మధ్య ఆ రోజు ఉదయం 11 గంటలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు. పాణ్యం టిక్కెట్టు కావాలని కోరడం లేదని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేసుకుంటూ పోతామని అన్నారు. సమావేశంలో మీదివేముల ప్రభాకర్‌ రెడ్డి, గుట్టపాడు లక్ష్మీకాంతరెడ్డి, కల్లూరు సింగిల్‌ విండో అధ్యక్షులు లక్ష్మీకాంతరెడ్డి, ఉల్లిందకొండ సింగిల్‌విండో అధ్యక్షులు రమణారెడ్డి, పందిపాడు ఎంపీటీసీ సభ్యుడు శివశంకర్‌రెడ్డి, బొల్లవరం ఎంపీటీసీ సభ్యుడు  రామక్రిష్ణారెడ్డి, కొంగనపాడు కేశవరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు హనుమంతరెడ్డి, నగర కార్యదర్శి గోపాల్‌రెడ్డి, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సలాం, మాజీ కార్పొరేటర్లు నర్సింహులు, కృష్ణమూర్తి, శుభాకర్, శివుడు, ఆనంద్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు