నా కుమారుడిని కిడ్నాప్ చేశారు

25 Sep, 2014 02:23 IST|Sakshi

హైకోర్టులో ఏపీ స్పీకర్ కోడెల కోడలు హెబియస్ కార్పస్
 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు కుమారుడు కె.శివరామకృష్ణ తన నాలుగేళ్ల కుమారుడిని అపహరించారని, తన కుమారుడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ శివప్రసాదరావు కో డలు పద్మప్రియ బుధవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, కోడెల కుమారుడు కె.శివరామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, విశాఖపట్నం ఎస్‌పీ, విశాఖపట్నం త్రీటౌన్ సీఐలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘నా భర్త శివరామకృష్ణకు ఇంతకు ముందే పెళ్లైందని, హింస భరించలేకే మొదటి భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయిందని తెలిసింది.

వీరి హింస, బాధలు భరించలేక నాలుగు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో నేను నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాను. 2010 అక్టోబర్ 18న నేను మగబిడ్డకు జన్మనిచ్చాను. ఈ నెల 17న నా తండ్రి ఇంటిలో లేని సమయంలో శివరామకృష్ణ, జయలక్ష్మీ సీఫుడ్స్ అధినేత కె.రమేష్, వికాస్ కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ సూరపనేని కోటేశ్వరరావు, వైజాగ్‌కు చెందిన కోనేరు సురేష్, ఇండో అమెరికన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుమతి, ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రికి చెందిన జితేంద్ర కలిసి మా ఇంటికి వచ్చి నా కుమారుడిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.’ అని ఆమె తన హెబియస్ కార్పస్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు