ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: మైసూరా రెడ్డి

27 Apr, 2015 17:17 IST|Sakshi
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: మైసూరా రెడ్డి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు తమ వైఖరిని స్పష్టం చేయాలంటూ వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత మైసూరా రెడ్డి  డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కేంద్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని చెప్పారు. బీజేపీ కుంటిసాకులు, పిల్లిమొగ్గలు వేయకుండా  స్పష్టమైన వైఖరి చెప్పాలన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత టీడీపీపై ఉందని తెలిపారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలిస్తే తామంతా కలిసి వస్తామని ఆయన చెప్పారు.

పార్లమెంట్లో ప్రత్యేక హోదా అంశాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీలు లేవనెత్తుతారని మైసూరా తెలిపారు. టీడీపీ ఎంపీలు తమకు మద్దతు ఇవ్వండి లేదా ఈ అంశాన్ని లేవనెత్తితే వారికి తమ మద్దతు తెలుపుతామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేసినా తాము మద్దతు ఇస్తామని మైసూరా రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు