జగన్‌పై హత్యాయత్నంలో చంద్రబాబు హస్తం

12 Nov, 2018 17:36 IST|Sakshi

కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్‌సీపీ నేత నల్లపరెడ్డి డిమాండ్‌  

సాక్షి,విడవలూరు(నెల్లూర్‌): ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంలో సీఎం చంద్రబాబు, డీజీపీల హస్తం ఉన్నట్లుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని జాన్‌పేట, ఎస్సీవాడకు చెందినవారు పెద్ద ఎత్తున ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించి. 

వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రుణాలు మాఫీ చేస్తానని చెప్పి.. చివరకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలను చంద్రబాబు నిండా ముంచేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఘరానా మోసగాడన్నారు. భూ పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని.. అసలు భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందే దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. చంద్రబాబుకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని.. వచ్చే ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదన్నారు. జగన్‌ సీఎం అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమన్నారు.  

మరిన్ని వార్తలు