నీట్‌లో సత్తా చాటిన సందీప్‌

18 Jul, 2019 08:56 IST|Sakshi

సూపర్‌ స్పెషాలిటీ విభాగం ఎండో క్రెనాలజీ కోర్సులో మూడో ర్యాంకు

సాక్షి, పాతగుంటూరు: గుంటూరు అరండల్‌పేటకు చెందిన డాక్టర్‌ నందిపాటి వెంకట సందీప్‌ నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ విభాగం ఎండోక్రెనాలజీ కోర్సులో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఈ పరీక్ష ఫలితాలు జూలై16న విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 1,513 మంది వైద్యులు పరీక్షలు రాయగా, 340 మార్కులతో సందీప్‌ మూడో ర్యాంకు సాధించారు. 2007లో ఎంసెట్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించి గుంటూరు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు పొందారు.

ఆప్తమాలజీ, సర్జరీ విభాగాలలో మెరిట్‌ సర్టిఫికెట్లు పొందారు. 2014లో పీజీ ఎంట్రన్స్‌లో తొలి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించి ఎండీ జనరల్‌ మెడిసిన్‌ను ఎంచుకున్నారు. పీజీ అనంతరం 2017, 2018లో జరిగిన నీట్‌ పరీక్షలో మంచి మార్కులు సాధించినప్పటికీ తాను కోరుకున్న ఎండోక్రెనాలజీ అంశంలో కశ్మీర్‌ మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని వదులుకున్నారు. అదే లక్ష్యంతో పరీక్ష రాసిన సందీప్‌ ఈసారి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. 

మరిన్ని వార్తలు