నందివర్గం ఎస్‌ఐ హల్‌చల్

14 Aug, 2015 03:18 IST|Sakshi

 బనగానపల్లె:నందవరం గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు వెంకటలచ్చమ్మ కుమారుడు శేఖర్‌గౌడ్‌ను నందివర్గం ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి అకారణంగా చితకబాదాడు. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడనే ఒకే ఒక్క కారణంతో టీడీపీ నేతల ప్రోద్బలంతో బుధవారం సాయంత్రం రహదారిపై కొట్టుకుంటూ స్టేషన్‌కు తరలించారు. అదే రోజు రాత్రి విడిచిపెట్టాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు ఎస్‌ఐ తీరును నిరసిస్తూ గురువారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎస్‌ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని, బాధితుడికి న్యాయం చేకూర్చాలంటూ నినాదాలు చేశారు. ఈ దశలో పాణ్యం ఇన్‌చార్జి సీఐ దేవప్రసాద్, పాణ్యం ఎస్‌ఐ మురళీమోహన్‌రావుతో పాటు నంద్యాల తాలూకా ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ శరత్‌చంద్రారెడ్డి స్టేషన్‌కు చేరుకుని కాటసానితో చర్చలు జరిపారు. ఇంటి వంటి సంఘటన జరగడం పొరపాటేనని, పారదర్శకంగా విచారణ చేపట్టి అధికారులకు విన్నవిస్తానని హామీ ఇచ్చారు.  
 
 ఎమ్మెల్యే బీసీ ఒత్తిడితోనే కేసులు
 బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఒత్తిడితోనే నియోజకవర్గంలోని పోలీసు అధికారులు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై అకారణంగా తప్పుడు కేసులు బనాయిస్తూ, వేధింపులకు గురి చేస్తున్నట్లు కాటసాని రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఆవరణలోనే విలేకరులతో మాట్లాడుతూ అవుకు మండలంలోని శివరం గ్రామంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మద్దిలేటి హత్యకు గురైతే బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు మండల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డిపై  కేసు నమోదు చేశారన్నారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ పోతే తాము ఊరుకునేది లేదన్నారు. ఆందోళనలో కాటసాని పినతండ్రి మాజీ ఎంపిపి కాటసాని శివారెడ్డి, సోదరులు కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి, బంధువులు అశ్వర్థరెడ్డి, దస్తగిరిరెడ్డితో పాటు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, అబ్దుల్‌ఖైర్, డాక్టర్ మహమ్మద్‌హుసేన్, రామ్మోహన్‌రెడ్డి, శివరామిరెడ్డి, తులసిరెడ్డి పాల్గొన్నారు.     
 

>
మరిన్ని వార్తలు