ఎమ్మెల్యే స్పందన; ఇద్దరు యువకులు సేఫ్‌

9 Feb, 2020 14:57 IST|Sakshi
చికిత్స పొందుతున్న ప్రవీణ్, విష్ణువర్ధన్‌ రెడ్డి

సెల్ఫీ ప్రమాదం, కాలు జారి కుందూలో పడిన యువకుడు

కాపాడేందుకు దూకి మరో యువకుడికి గాయాలు

ఎమ్మెల్యే శిల్పా రవి స్పదించటంతో ప్రాణాలతో బయట పడిన యువకులు

సాక్షి, బొమ్మలసత్రం/కర్నూలు: కుందూనది వంతెనపై సరదాగా సెల్ఫీ దిగేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఘటన నంద్యాల పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. రూరల్‌ సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. స్థానిక కల్పన సెంటర్‌లో నివాసముంటున్న ప్రవీణ్‌.. కర్నూలు పుల్లారెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. శని, ఆది వారాలు సెలవు దినాలు కావటంతో వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామనికి చెందిన స్నేహితుడు విష్ణువర్ధన్‌ రెడ్డితో కలిసి ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక ఉన్న కుందూనది వంతెన వద్దకు వెళ్లారు. సరదాగా సెల్ఫీ దిగేందుకు వంతెన చివరి భాగంలో నిలబడ్డారు. సెల్ఫీ దిగుతుండగా ప్రవీణ్‌ ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. 

ప్రవీణ్‌ను కాపాడేందుకు విష్ణువర్ధన్‌ రెడ్డి దూకే క్రమంలో అదుపు తప్పి రాళ్లపై పడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి వాహనం నిలిపి తన అనుచరులతో యువకులను కాపాడారు. ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయప డ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విష్ణువర్ధన్‌ రెడ్డిని వైద్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. కళాశాలలో ఓ యువతి ప్రేమ పేరుతో ప్రవీణ్‌నను మోసం చేయడంతో తట్టుకోలేక కుందూలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని.. అతన్ని కాపాడే క్రమంలో స్నేహితుడు విష్ణువర్ధన్‌ రెడ్డి గాయపడ్డాడని స్థానికులు చెబుతున్నారు.

సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే శిల్పా రవి

మరిన్ని వార్తలు