నోరు పారేసుకున్న నన్నపనేని

11 Sep, 2019 11:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘చలో ఆత్మకూరు’ సందర్భంగా టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ రాజధాని ప్రాంతంలో హల్‌చల్‌ చేస్తూ ఉద్రిక్తతలు పెంచుతున్నారు. అడ్డుకుంటున్న పోలీసులపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. సాటి మహిళ అని కూడా చూకుండా టీడీపీ మహిళా నాయకులు దూషణకు దిగడంతో మహిళా ఎస్‌ఐ ఒకరు మనస్తాపం చెంది విధుల నుంచి వెళ్లిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘దళితుల వల్లనే దరిద్రం’ అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్‌ఐ అనురాధపై నన్నపనేని నోరు పారేసుకున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో కలత చెందిన ఎస్‌ఐ అనురాధ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని ఎలా మాట్లాడడం సరికాదని అన్నారు.

తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అంతకుముందు చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పోలీసు ఉన్నతాధికారిని దుర్భాషలాడారు. కాగా, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా మహిళా ఎస్‌ఐతో దురుసుగా ప్రవర్తించారు. (చదవండి: మహిళా పోలీసుపై అఖిలప్రియ జులుం)

మరిన్ని వార్తలు