నేడు మంత్రి నారా లోకేష్‌ రాక

11 Jan, 2019 07:59 IST|Sakshi
ఇది టీడీపీ కార్యాలయం కాదు పెద్దాపురం మండల పరిషత్‌ కార్యాలయం

పథకాలకు పచ్చదనం పూత

తూర్పుగోదావరి,పెద్దాపురం: ఆ కార్యాలయం అధికార పార్టీది కాదు. కానీ పచ్చరంగు పులుముకుంది. అధికారికంగా సేవలందించాల్సిన ప్రభుత్వ కార్యాలయానికి పసుపు రంగులద్దారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్‌తో ప్రారంభించనుండడంతో ఆయనకు ఇష్టమైన టీడీపీ రంగులతో పెద్దాపురం పట్టణాన్ని పసుపుమయం చేయడమే ధ్యేయంగా పాలకులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఈ హడావిడిలో అధికారులను సైతం ముప్పుతిప్పలు పెట్టిస్తూ ప్రభుత్వ కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చేశారు. దీనికి నిదర్శనం నూతనంగా సుమారు కోటి రూపాయలతో నిర్మించిన మండల పరిషత్‌ కార్యాలయమే.

రామారావుపేటలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్‌ కార్యాలయాన్ని వదిలి అమాత్యుల క్యాంపు కార్యాలయం సమీపంలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. దీంతో కోటి రూపాయలు కేటాయించి నిర్మించిన మండల పరిషత్‌ కార్యాలయాన్ని రెండు రోజుల వ్యవధిలో మంత్రి నారా లోకేష్‌ ప్రారంభిస్తారని చెప్పడంతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మండలంలోని కట్టమూరు గ్రామంలో సుమారు ఐదు కోట్లతో నిర్మించిన తాగునీటి పథకానికి పసుపు రంగును పులిమేశారు. వీటిని శుక్రవారం మంత్రి లోకేష్‌ ప్రారంభించనున్నారు.

మరిన్ని వార్తలు