తెలుగు మీడియం వల్లే ర్యాంకులు రాలేదు

23 Nov, 2017 04:32 IST|Sakshi

ప్రశ్నోత్తరాలలో మంత్రి నారాయణ సమాధానం

సాక్షి, అమరావతి: తెలుగు మాధ్యమంలో చదవడం వల్లే రాష్ట్రంలో వేలాదిమంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో ర్యాంకులు సాధించలేకపోయారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మున్సిపల్‌ స్కూళ్లలో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడంపై అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

2015–16, 2016–17 సంవత్సరాల్లో మున్సిపల్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల్లో ఒక్కరికీ పదివేలలోపు ఇంజనీరింగ్‌ ర్యాంకులు రాలేదంటే ఇంగ్లిష్‌ రాకపోవడమే కారణమని చెప్పారు.  మాతృభాష తెలుగును తీసెయ్యట్లేదని, ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చునన్నారు. దీనికి పలువురు సభ్యులు అడ్డుతగిలారు.

తెలుగు మీడియంలో చదవడం వల్లే ర్యాంకులు రాలేదనడం సరికాదని, దీనిపై తమకు మాట్లాడే అవకాశమివ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, శ్రావణ్‌కుమార్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిలతోపాటు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు డిమాండ్‌ చేశారు. ఇందుకు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఒప్పుకోలేదు.దీంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. ఆంగ్ల మాధ్యమం పేరుతో తెలుగును దూరం చేయడం దారుణమన్నారు.

>
మరిన్ని వార్తలు