కడప గడపలో..బ్యాడ్మింటన్‌ సంబరం !

3 Nov, 2017 09:17 IST|Sakshi

19 నుంచి 23 వరకు జాతీయస్థాయి పోటీలు నిర్వహణ

తరలి రానున్న 40 జట్లు

కడప స్పోర్ట్స్‌ : జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు  కడప నగరం మరోసారి వేదిక కానుంది. గతేడాది బ్యాడ్మింటన్‌ అసోసియేషన్, 62వ ఎస్‌జీఎఫ్‌ బ్యాడ్మింటన్‌ జాతీయస్థాయి పోటీలను అద్భుతంగా నిర్వహించడంతో మరోసారి జాతీయస్థాయి పోటీలను నిర్వహించే అవకాశం జిల్లాకు దక్కింది. దీంతో ఈ నెల 19 నుంచి 23 వరకు కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో బ్యాడ్మింటన్‌ సందడి ప్రారంభం కానుంది. 63వ జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 విభాగంలో బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నారు.  

40 జట్లు.. 400 మంది క్రీడాకారులు
ఈ జాతీయస్థాయి పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 40 జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. ఒక్కో జట్టు నుంచి బాలురు 5 మంది, బాలికలు 5 మంది చొప్పున మొత్తం మీద 400 మంది క్రీడాకారులు, మరో 100 మంది అఫిషియల్స్‌ ఈ టోర్నీకి విచ్చేయనున్నారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఏపీ నుంచి కూడా 5 మంది బాలురు, 5 మంది బాలికలు ఎంపికకాగా వీరిలో కడప నుంచి బాలుర విభాగంలో అబ్దుల్‌ రెహమాన్, బాలికల విభాగంలో కె. వెన్నెల ఏపీ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో టీం చాంపియన్‌షిప్‌తో పాటు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే బాలబాలి కల జట్లను ఎంపిక చేయనున్నారు.

ఖేలోఇండియాకు అవకాశం..
కాగా ఈ  ఏడాది జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు మరో అరుదైన అవకాశం లభించనుంది. జాతీయస్థాయి బ్యా డ్మింటన్‌ పోటీల్లో సత్తాచాటే క్రీడాకారులకు ఖేలోఇండియా జాతీయస్థాయి పోటీలకు నేరుగా వెళ్లే అవకాశం కల్పించారు. గతంలో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన తర్వాతే ఖేలోఇండియా జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉండేది. అయితే ఈ సారి నుంచి ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటే క్రీడాకారులను ^ నేరుగా జాతీయస్థాయి పోటీలకు పంపే అరుదైన అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. 

మరిన్ని వార్తలు