నవనిర్మాణ దీక్షకు భారీ ఏర్పాట్లు

2 Jun, 2015 03:58 IST|Sakshi
నవనిర్మాణ దీక్షకు భారీ ఏర్పాట్లు

దీక్షకు ప్రదర్శనగా చంద్రబాబు రాక
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ నెల 2 నుంచి చేపడుతున్న నవ నిర్మాణ దీక్షకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సమయంలో, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాదైనా నెరవేర్చలేక విఫలం కావడంతో ఎదురవుతున్న విమర్శల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి.. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలపై నెట్టడానికి ఈ కార్యక్రమాలను ఉపయోగించుకుంటున్నట్లు..

జరుగుతున్న ఏర్పాట్లు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి స్టెల్లా కాలేజీ నుంచి, ప్రజాప్రతినిధులు మిగిలిన మూడు వైపుల నుంచి ర్యాలీగా దీక్షా స్థలానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజలు, ఉద్యోగులు కూర్చునేందుకు జాతీయ రహదారిపైనే నాలుగువేల కుర్చీలు వేయనున్నారు. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి ర్యాలీగా దీక్షాస్థలికి చేరుకుంటారు. 9.30 నుంచి 10 గంటల వరకు ముఖ్యమంత్రి మాట్లాడతారు. కాగా, హైవేపై దీక్ష చేపడుతున్న ప్రభుత్వం అందుకు తమ అనుమతి తీసుకోలేదని జాతీయ రహదారులశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు