బేషరుతుగా బాబు క్షమాపణలు చెప్పాలి

3 Jul, 2018 08:38 IST|Sakshi
నాయీబ్రాహ్మణులకు మద్దతు తెలుపుతున్న వైఎస్సార్‌ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్‌

గుంటూరులో నంద నాయీబ్రాహ్మణ యువసేన సభ్యుల దీక్ష

ఎస్‌వీఎన్‌ కాలనీ(గుంటూరు): నాయీబ్రాహ్మణులపై సీఎం చంద్రబాబునాయుడు చేసిన అనుచిత వాఖ్యలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నంద నాయీబ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జినంద అధ్యక్షత పలువురు సభ్యులు సోమవారం గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.

వారికి దీక్షకు మద్దతు తెలిపిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో రోజులు నెట్టుకొస్తున్న నాయీబ్రాహ్మణులు సీఎం చంద్రబాబును కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే ఆయన తన స్థాయిని మరచి మరీ అనుచితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్న చంద్రబాబుకు బీసీల కష్టనష్టాలు పట్టడంలేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుతో పాటు, వారికి దేవాలయాల్లో ఉద్యోగ భద్రత కల్పిస్తామని, సెలూన్లకు విద్యుత్‌ బిల్లుల్లో రాయితీ ఇస్తామని తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఇంటూరి బాబ్జీనంద మాట్లాడుతూ.. నాయీబ్రాహ్మణులకు ముఖ్యమంత్రి బేషరుతుగా క్షమాపణ చెప్పేవరకు నిరసన కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బాపట్ల పార్లమెంటరీ జిల్లా నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సవరం రోహిత్, కాపు సంఘం నేత వంగవీటి నరేంద్ర, వడ్డెర సంఘం నాయకుడు వెంకట్, కుమ్మర యువసేన నేత లలిత్‌ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

మరిన్ని వార్తలు