ప్రభుత్వం ఆదుకోవాలి..

5 Aug, 2013 04:13 IST|Sakshi

 ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో పక్షం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రధాన పంటలైన పత్తి, సోయా, కంది తదితర పంటలతోపాటు కూరగాయల పంట లు దెబ్బతిన్నాయి. వర్షానికి కూరగాయల పం టలు నీటమునిగి మొక్కలు కుళ్లిపోయాయి. ప్రధానంగా టమాట, బీర, బెండ, వంకాయ, అల్చంత, గోబీ, మిరప, చిక్కుడు, దొండ, కా కర, కోత్తిమీర, ఆకుకూర పంటలపై అధిక ప్ర భావం పడింది. దీంతో మార్కెట్‌లో కూరగాయ ల కొరత ఏర్పడి ధరలు చుక్కలను అంటడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
 
 వేల ఎకరాల్లో కూరగాయల పంట నష్టం
 ఈనెల 15వ తేదీ నుంచి పది రోజులపాటు ఏకధాటిగా కురిసిన వర్షాలకు కూరగాయల పంట లు దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో రైతులు పంట ను నారుమళ్లలోనే కోల్పోయారు. టమాట నర్సరీల్లోనే తుడిచి పెట్టుకుపోయింది. తీగజాతి కూరగాయలపై కూడా తీవ్ర ప్రభావం చూపిం ది. జిల్లా వ్యాప్తంగా కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కౌటాల, భీమిని, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, ఇచ్చోడ, జైనథ్ మండలాల్లో కూరగాయలు అధికంగా సాగవుతాయి. దాదాపు 2,122 ఎకరాల్లో కూరగాయల పంటలు రైతులు నష్టపోయినట్టు ఉద్యానవన శాఖ, రెవెన్యూ శాఖాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వీటి నష్టం రూ.50 లక్షలు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ, జైనథ్ ప్రాంతాల్లో టమాట నర్సరీ నారుమలుల్లోనే 1,250 ఎకరాల్లో కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. కాగజ్‌నగర్, కౌటాల, సిర్పూర్(టి) ప్రాంతాల్లో 200 ఎకరాల పైబడి కాకర, పర్వల్ పంటలు రైతుల చేతికి అందకుండా పోయాయి. భీమినిలో 150 ఎకరాల్లో పసుపు కొమ్ములు వరద పాలు కావడంతో రైతులు పూర్తిగా నష్టపోయారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 6 వేల హెక్టార్లలో కూరగాయల పంటలు సాగవనున్నట్లు అంచనా వేశారు. టమాట 3వేల హెక్టార్లలో అత్యధికంగా సాగవుతుంది. పూగోబి, ఆకుగోబి, కాకర, బీర, సోర, పచ్చిమిరప, బెండకాయ తదితర పంటలు మిగతా హెక్టార్లలో సాగవుతాయి.
 
 కూరగాయల కొరత
 మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయలు రాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా బీర, వంకాయల కొరత ఉంది. ఆదిలాబాద్ రైతుబజార్‌లోనే కూరగాయల ధరలు చుక్కలనంటాయి. మిగతా మార్కెట్లలో కూరగాయల ధర లు అంతకంటే ఎక్కువగా ఉండడంతో వినియోగదారులు కొనేందుకు జంకుతున్నారు. ఆదిలాబాద్ రైతుబజార్‌లో జైనథ్, అంకోలి, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, సీతాగొంది, తలమడుగు, పొన్నారి తదితర గ్రామాల నుంచి వివిధ రకాల కూరగాయలను తీసుకొచ్చి రైతులు విక్రయిస్తా రు. అలాంటిది వర్షాల ప్రాభావంతో వంకాయ, బీర, బెండ, చిక్కుడు పంటలు నష్టపోవడంతో మార్కెట్‌కు కొంత మాత్రమే చేరుకుంటున్నా యి. మంచిర్యాల, నిర్మల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఉట్నూర్, భైంసా, బోథ్, చెన్నూర్, సిర్పూ ర్ తదితర ప్రాంతాల్లో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే నాగ్‌పూర్, తదితర ప్రాంతాల నుంచి టమాట ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
 
 మళ్లీ విత్తనాలు కొనే శక్తిలేదు..
 నాకున్న భూమిలో టమాటా సాగు చేశాను. పెట్టుబడి కోసం ప్రైవేటు గా అప్పు చేసి రూ.10వేలు తెచ్చా ను. టమాటా నారు పోశాను. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో నారు కుళ్లిపోయింది. మళ్లీ విత్తనా లు కొనడానికి డబ్బులు లేవు. ఇక కూరగాయల సాగు ఏమి చేయాలి. అధికారులు దయచేసి ఆదుకోవాలి.
 - దగ్లే జనార్దన్, వడగామ్, ఇంద్రవెల్లి.
 
 రూ. లక్ష మట్టిపాలు
 నేను 15 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని టమాట సాగు చేస్తున్నా. ఈ పంట డబ్బులతో గత ఖరీఫ్‌లో చేసిన అప్పు లు తీర్చాలనుకున్నా. 15 ఎకరాల్లో ట మాట నాటు వేశా. నాటు పడిన రెండో రోజు నుంచి మూడు రోజులపాటు కుం డపోత వర్షం కురిసింది. ఇంకే ముంది 15 ఎకరాల్లో టమాటకు పెట్టిన పెట్టుబడి సుమారు రూ.లక్ష మట్టిపాలైనాయి.
 - నూర్‌ఖాన్, లింగాపూర్, గుడిహత్నూర్
 
 గవర్నమెంటు మాకోసం ఏమీ చేయడం లేదు
 ఏడెకరాల్లో టమాట నాటిన. విత్తనాలు, నాట్లు, నర్సరీకి ఎరువులు, కూలీలు రూ.35 వేలు ఖర్చుపెట్టిన. అంతా అనుకున్నట్లుగా జరుగుతుందని ఆశపడ్డా. కానీ మూడు రోజులు వర్షం కురవడంతో కొంత పంట కొట్టుకొని పోగా.. మరికొంత నీళ్లలో కుళ్లిపోయింది. చివరకు ఏమీ మిగల లేదు. గవర్నమెంటు మాకోసం ఏమీ చేయడం లేదు. కనీస నష్టపరిహారమైనా అందుతే కూలీలకు డబ్బులైన ఇవ్వొచ్చు.
 - లద్దే విశ్వంబర్, గుడిహత్నూర్

నా పేరు కాగ్నే నారాయణ. మాది ఇంద్రవెల్లి మండలం. నాకు ఆరెకరాల పంట భూమి ఉంది. ఇందులో టమోట సాగు చేశాను. ఖరీఫ్ ప్రారం భంలో వరుణుడు అనుకూలించడంతో కూరగాయలు సాగు చేశాను. విత్తనాల కోసమే రూ.15 వేలు ఖర్చు చేశాను. పదిహేను రోజులు వర్షాలు ఏకధాటిగా కురియడంతో టమాట మొక్కలకు కర్ప రోగం వచ్చింది. రెండు మూడు రోజులు మొక్కలు   నీటిలోనే ఉండటంతో కుళ్లిపోయాయి. మళ్లీ విత్తనాలు కొనే స్థోమత లేదు. అధికారులే ఆదుకోవాలి.
 

మరిన్ని వార్తలు