బాబు నిర్వాకం.. రైతుకు శాపం

29 Dec, 2014 02:31 IST|Sakshi

రైతులకు అప్పులివ్వబోమని చెబుతున్న బ్యాంకులు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు రుణాలు మాఫీ చేస్తామంటూ రైతుల్లో ఆశలు కల్పించి, అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల నిబంధనలు, మెలికలతో అన్నదాతను ముప్పు తిప్ప లు పెడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికీ అరకొరగానే రుణాలు మాఫీ చేసింది. చంద్రబాబు నిర్వాకం ఫలితంగా ఇప్పుడు రైతులకు కొత్త రుణాలు కూడా రాకుండా పోతున్నాయి.

సర్కారు ఇప్పటికీ రుణాల మాఫీ సవ్యంగా చేయకపోవడంతో బ్యాంకులు రైతులకు కొత్తగా అప్పులు ఇవ్వడంలేదు. ఖరీఫ్ ముగిసిపోయి రబీ సీజన్ వచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. గత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్‌లో రైతుల రుణాలకు పావలా వడ్డీ, వడ్డీ లేని నిధులను బ్యాంకులకు ప్రభుత్వం విడుదల చేయలేదు. రూ. లక్ష వరకు రుణాలు  తీసుకుని సకాలంలో చెల్లిస్తే వడ్డీ లేని రుణం వర్తిస్తుంది.

లక్ష రూపాయలకుపైగా రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తే పావలా వడ్డీ వర్తిస్తుంది. సకాలంలో రుణాలు చెలిచిన వారి వడ్డీల నిధులను ఇవ్వాలని బ్యాంకులు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, స్పందన రాలేదు. ప్రభుత్వం వడ్డీ చెల్లించకపోవడం వల్ల ఆ భారమూ బ్యాంకులపై పడిందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అంటోం ది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజ న్లలో కలిపి రూ.56,019 కోట్లు వ్యవసాయ రుణాలుగా మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటివరకు రూ. 13,789 కోట్లు మాత్రమే ఇచ్చాయి.

ఇది రుణ లక్ష్యంలో 24.16 శాతమే. ఇదే సమయానికి గత ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యంలో 54.17 శాతం బ్యాంకులు మంజూరు చేశాయి. ఎస్సీ, ఎస్టీ,, బీసీ సంక్షేమ ఆర్థిక సహకార సంఘాల ద్వారా రుణాల మంజూరు కూడా ఇదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన  188వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. దీంట్లో  బ్యాంకులు పలు అంశాలు ప్రస్తావించనున్నాయి.

మరిన్ని వార్తలు