ఎమ్మెల్యేల శాసన ప్రమాణం

13 Jun, 2019 09:06 IST|Sakshi
మంత్రులు గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌

సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైఎస్సార్‌సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగు పెట్టారు. బుధవారం 15వ శాసన సభ కొలువు దీరింది. ‘..అను నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను..’ అంటూ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎనిమిది మంది శాసనసభ్యులు శాసన పదవీ ప్రమాణం చేశారు. వీరందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.05 గంటలకు శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగిచిన వెంకట అప్పలనాయుడు సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు. జాతీయ గీతంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్షర క్రమంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా నుంచి ఎన్నికైన 10 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్లో మంత్రులైన మేకపాటి గౌతమ్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌తోపాటు మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వెలగపల్లి వరప్రసాద్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు.

మరిన్ని వార్తలు