నవ వధువుపై ఘాతుకం

29 Apr, 2016 03:38 IST|Sakshi
నవ వధువుపై ఘాతుకం

 వంగలమడుగు     (అడ్డతీగల) :  ఏజెన్సీలోని అడ్డతీగల మండలం వంగలమడుగు గ్రామంలో గురువారం నవ వధువుపై హత్యాయత్నం జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. కత్తిపూడి గ్రామానికి చెందిన ప్రశాంతి(19)కి ఈ నెల 19న ఏలేశ్వరానికి చెందిన వడ్రంగి పనిచేసే అలుకోజి శివతో వివాహమైంది. కాగా గురువారం మధ్యాహ్నం బహిర్భూమికి వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చి కాళ్లు కడుక్కుంటుండగా.. ఓ దుండగుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను తండ్రి కవులూరి చక్రం, భర్త శివ 108లో అడ్డతీగల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

 80 శాతంపైగా శరీరం కాలిపోవడంతో అడ్డతీగల జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టు న్యాయమూర్తికి సమాచారమిచ్చిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వంగలమడుగులో తన నానమ్మ ఉందని, తనకు అన్నీ నానమ్మే అని అల్లుడు శివ అనడంతో బుధవారం మధ్యాహ్నం అక్కడకు తీసుకువెళ్లామని తండ్రి చక్రం వివరించాడు. తనపై ఎవరో కిరోసిన్ పోసి అగ్గిపుల్ల వేశారంటూ ప్రశాంతి తన వద్దకు వచ్చి పడిపోయిందని పేర్కొన్నాడు. బాధితురాలి నుంచి న్యాయమూర్తి సి.సురేష్ వాగ్మూలం నమోదు చేశారు. అడ్డతీగల సీఐ ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్సై టి.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు