లక్ష్యం కష్టమే..

19 Feb, 2015 00:52 IST|Sakshi

ఇవ్వాల్సింది బారెడు.. ఇచ్చింది మూరెడు
రుణాలందక అల్లాడుతున్న మహిళా సంఘాలు
బకాయిలు చెల్లిస్తేనే కొత్తరుణాలంటున్న బ్యాంకర్లు
లక్ష్యం అధిగమించలేక చతికలపడిన యంత్రాంగం
 

ఇవ్వాల్సింది బారెడు.. ఇచ్చింది మూరెడు అన్న చందంగా తయారైంది జిల్లాలో డ్వాక్రా సంఘాల రుణలక్ష్యం తీరు. రుణమాఫీ మహిళాసంఘాలనే కాదు అధికారులను సైతం ముప్పుతిప్పలు  పెడుతోంది. అప్పులుపుట్టక మహిళలు గగ్గోలు పెడుతుంటే లక్ష్యం చేరే పరిస్థితి లేక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరొక పక్క కొండలా పేరుకు పోయిన బకాయిలు వసూలు కాక బ్యాంకర్లు ఇబ్బందులపాలవుతున్నారు.
 
విశాఖపట్నం: పొదుపు ఉద్యమాన్ని రుణమాఫీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చింది. గద్దెనెక్కి ఎనిమిది నెలలైనా మాఫీకాదు కదా కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఊసెత్తకుండా కాలయాపన చేస్తు న్న ప్రభుత్వం.. ఏది ఏమైనా రుణలక్ష్యం చేరాలంటూ     అధికారుల మెడపై కత్తి పెడుతోంది. వడ్డీలతో పేరుకుపోయిన బకాయిలు చెల్లిస్తే తప్ప కొత్త రుణాలివ్వలేమని బ్యాంకర్లు తెగేసి చెబుతుండగా.. కనీసం కొత్త సంఘాలకైనా రుణాలివ్వాలంటూ వారి కాళ్లా వేళ్లాపడుతున్నారు అధికారులు. గ్రామీణ జిల్లాలోని 44,211 సంఘాల్లో 5,08,782 మంది సభ్యులున్నారు. వీటిలో 21,386సంఘాలకు రూ.641.42కోట్లుఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం 5వేల సంఘాలకు రూ.195కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు.జీవీఎంసీపరిధిలోని 21,660 డ్వాక్రా సంఘాల్లో 2,30,656 మంది సభ్యులున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్‌విశాఖలో 7468సంఘాలకు రూ.175.96కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటి వ రకు కేవలం 2045సంఘాలకు రూ.65 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. ఇక యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీల్లోని 2032 సంఘాల్లో 23వేల మంది సభ్యులున్నారు. ఈ రెండు మున్సిపాల్టీల్లో 732 సంఘాలకు రూ.19.05కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటి వరకుకేవలం 185 సంఘాలకు కేవలం రూ.6.36కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇలా మొత్తమ్మీద జిల్లాలో నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 32 శాతం మాత్రమే చేరుకోగలిగారు. గతంలో ఏటా నూరుశాతం లక్ష్యాన్ని చేరుకోవడమేకాదు.. లక్ష్యానికి మించి రుణాలిచ్చేవారు. ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అతికష్టమ్మీద రూ.270కోట్లకు మించి అప్పులివ్వలేని దుస్థితిలో బ్యాంకర్లు ఉన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీపుణ్యమే పొదుపు సంఘాల నేటి దుస్థితికి కారణమని అధికారులే బాహాటంగా చెబుతున్నారు. వడ్డీ లేని రుణ పథకం కింద పొందే రాయితీతో పాటు పావలా వడ్డీ రాయితీని కూడాసంఘాలు కోల్పోయాయి. మరొక పక్క 14 శాతం వడ్డీతో బకాయిలు తడిసిమోపెడయ్యాయి.

ఒక్కో సంఘానికి గడిచిన ఏడాదిలో వడ్డీయే 50 వేల వరకు పడినట్టుగా బ్యాంకర్లు చెబుతున్నారు. వడ్డీతో అసలు చెల్లించ లేక ఇంకా లక్షలాది సంఘాలు ప్రభుత్వ రుణమాఫీకోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. సంక్రాంతికి ప్రతీ మహిళకు రూ.10వేల చొప్పునసంఘానికి లక్ష చొప్పున జమ చేస్తామని గతేడాది విశాఖ పునరుద్ధరణ వేడుకల్లో చంద్రబాబు ప్రకటించిన హామీ నేటికీ అమలుకు నోచుకోక పోవడం పట్ల డ్వాక్రా సంఘాల సభ్యులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చేతకానప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారంటూ మండిపడుతున్నారు. బ్యాంకర్లు ముఖం చాటేయడంతో వడ్డీలకు అప్పులు తె చ్చుకోలేక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నామని వాపోతున్నారు.
 

మరిన్ని వార్తలు