మత్తులో వాహనాలు నడిపితే రూ. 10 వేల జరిమానా
ఆల్కహాల్ శాతం 30 దాటితే మూడు నెలలు జైల శిక్ష
త్వరలో జిల్లాలో అమలు
సాక్షి, కర్నూలు : డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ దొరికితే ప్రస్తుతం రూ. 1000 జరిమానా. ఇకపై అలా చిక్కితే రూ. 10వేలు జరిమానా విధించే అవకాశం ఉంది. నిబంధనలు పాటించి డబ్బులు ఆదా చేసుకొండి. ట్రాఫిక్ పోలీసులు ప్రధాన కూడళ్లలో వాహనదారులకు ఈ విధంగా అవగాహన కల్పిస్తున్నారు. నూతన మోటారు వాహనాల చట్టం 2019పై పోలీసు సిబ్బంది ప్రచారం విస్తృతం చేశారు. ఇటీవలే ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయడంతో త్వరలో కొత్త చట్టంలోని నిబంధనలను జిల్లాలో అమలు చేయనున్నారు. కొత్త చట్టం సవరణలను కేంద్రం ఆమోదించినప్పటికీ రాష్ట్రంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.
ఉల్లంఘనల విషయంలో జరిమానా రుసుం ఎంత విధించాలన్న నిర్ణయం కేంద్ర నిబంధనల ప్రకారం గరిష్టంగా లేదా అంతకంటే తక్కువగా విధించేందుకు అవకాశం ఉంటుందని డ్రంకెన్ డ్రైవ్ విషయంలో భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. మద్యం తాగి బ్రీత్ ఎనలైజర్ పరికరం ద్వారా తనిఖీ చేసినప్పుడు 30 శాతంకన్నా ఎక్కువగా వచ్చినప్పుడు జరిమానాతో పాటు మూడు నెలల జైలు శిక్ష పడే విధంగా ట్రాఫిక్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వాహన చట్టం ప్రకారం తాగి వాహనం నడిపితే రూ. 10వేలు జరిమానా లేక మూడు నెలల జైలుశిక్ష అమలుకు చర్యలు తీసుకొంటున్నట్లు ట్రాఫిక్ సీఐ శ్రీనివాస మూర్తి తెలిపారు.