త్వరలో హైదరాబాద్‌కు తబ్రేజ్

18 Sep, 2013 02:01 IST|Sakshi

దిల్‌సుఖ్‌నగర్ కేసులో తీసుకురానున్న ఎన్‌ఐఏ
 సాక్షి, హైదరాబాద్:  దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్‌పై ఉగ్రవాది తబ్రేజ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. పేలుళ్లలో నేరుగా పాల్గొన్న తబ్రేజ్‌ను ఇక్కడకు తీసుకు వచ్చేందుకు ఢిల్లీ కోర్టు నుంచి ఎన్‌ఐఏ అధికారులు అనుమతి పొందారు. ఈనెల 19 లోపు హైదరాబాద్‌కు తీసుకువచ్చి, స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. కేసులో తబ్రేజ్‌ను ఎన్‌ఐఏ అధికారులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఎన్‌ఐఏ  ఇప్పటికే తబ్రేజ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించింది.
 
 భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టుతో తప్పిన భారీ ముప్పు: మంగళూరులో 90 ఐఈడీలు స్వాధీనం
 దేశంలోని ప్రధాన నగరాల్లో  విధ్వంసాలకు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్ర దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల నిందితులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టుతో త్రుటిలో తప్పింది. ఈ పేలుళ్లకు ముందు, తర్వాత తబ్రేజ్‌తోపాటు ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన రహస్య ప్రాంతంలో పెద్దసంఖ్యలో బాంబులను పోలీసులు ఇటీవల కనుగొన్నారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని జఫర్ హైట్స్ భవంతి మూడో అంతస్తులో ఎన్‌ఐఏ అధికారులు దాడులు చేసి పేలుళ్ల కోసం సిద్ధం చేసిన 90 అధునాతన పేలుడు పరికరాలను(ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న భారత్-నేపాల్ సరిహద్దులో యాసిన్, తబ్రేజ్‌లను అరెస్టు చేయడం తెలిసిందే. తబ్రేజ్ వెల్లడించిన సమాచారం ఆధారంగా మంగళూరులోని రహస్య డెన్‌ను ఈ నెల 7న గుర్తించారు. తబ్రేజ్‌ను తీసుకెళ్లి డెన్‌లోని ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు