తిరుపతి : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను సింగపూర్ తరహా నైట్ సఫారీగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జూ అధికారులు తయారు చేసిన మాస్టర్ ప్లాన్, లే అవుట్లతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొత్తం 200 ఎకరాల విస్తీర్ణంలో సందర్శకులను ఆకట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దాలని అటవీ శాఖ యోచిస్తోంది.
రూ.50 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదనలకు ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయం ఆమోదం తెలియజేస్తే జూ అధికారులు టెండర్లకు వెళ్లే అవకాశం ఉంది. సెంట్రల్ జూ అథారిటీ అనుమతుల మేరకు నైట్ సఫారీ ఏర్పాటుకు పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న జూ మెయిన్ గేటు నుంచి శ్రీవారి మెట్లకు వెళ్లే రోడ్డుకు కుడివైపున నైట్ సఫారీ పనులు చేపట్టడం వల్ల సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగే వీలుందని జూ అధికారులు భావిస్తున్నారు.