ఉద్యోగాలు భర్తీ చేయకపోతే అసెంబ్లీ ముట్టడి

30 Jun, 2018 12:15 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల పన్నెండు వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని విజయవాడలో నిరుద్యోగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన జాబు లేదని ఐక్యవేదిక నేతలు విమర్శించారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని ఇంతవరకు భృతి కూడా చెల్లిందలేదన్నారు. గ్రూప్‌ 1, 2 ఉద్యోగాలకు పాత పద్దతిలోనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని, డీఎస్సీ పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల భర్తీ చేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని ఐక్యవేదిక నేతలు ప్రకటించారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు యువత ఓట్లను దండుకున్నారని పేర్కొన్నారు. ఖాళీలను ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.  
 

మరిన్ని వార్తలు