అవినీతిపరులపై చర్యలేవి?

21 Apr, 2015 04:02 IST|Sakshi

 ఏలూరు (టూటౌన్) : జిల్లా సహకార కేంద్రబ్యాంకు చాగల్లు బ్రాంచిలో నకిలీ బంగారం కుదువ పెట్టి రూ. 2 కోట్ల 35 లక్షల 62 వేలకు బ్యాంకును మోసం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేసి ఆరునెలలు అయినప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయటం లేదని జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్ ముత్యాల  వెంకటేశ్వరరావు (రత్నం) ఆరోపించారు. ఆయన సోమవారం వివరాలు అందచేశారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న 27 మంది వ్యక్తులతో పాటు బ్రాంచిలో అప్రయిజర్‌గా పనిచేసిన గొర్తి శ్రీనివాసరావు, బ్రాంచి మేనేజర్‌లు వాడ్రేవు సుబ్బారావు, కూచిపూడి సత్యనారాయణ, అసిస్టెంట్  మేనేజర్ సీహెచ్ హరిత, క్యాషియర్ గద్దే రామారావు తదితరులపై, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మానుకొండ కృష్ణారావు 2014 సెప్టెంబర్ 24వ తేదీన చాగల్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై ఆ మరుసటి రోజునే కేసు నమోదు చేసిన పోలీసులు
 
 ఇంతవరకూ వారిని అరెస్ట్ చేయలేదన్నారు. దీనిపై  గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన ఎన్.రఘురామిరెడ్డితో పాటు ప్రస్తుత ఎస్పీ బాస్కర్‌భూషణ్‌ను స్వయంగా కలిసి చెప్పినప్పటికి ప్రయోజనం లేదన్నారు. కొవ్వూరు డీఎస్పీకి ప్రతి రోజూ ఫోన్ చేస్తున్నానన్నారు. అయినప్పటికి వారు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో అర్థం కావటం లేదని ముత్యాలరత్నం ఆరోపించారు.  వారిపై చర్యలు తీసుకోకపోవటంతో బ్రాంచికి రికవరీ రావటం లేదన్నారు.
 విచారణ అధికారిగా
 
 నిడదవోలు సీఐ
 ఈ కేసులో రికవరీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అరెస్ట్‌లు చేయటం పెద్ద విషయం కాదు. ప్రభుత్వ సొమ్మును రా బట్టాలన్నదే మా ఉద్దేశం. ఈ కేసును నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ విచారిస్తున్నా రు. నాకు ఈ రోజే ఫోన్ చేసి అడిగారు. రోజు ఫోన్ చేయటం అనేది అబద్దం.
 - నర్రా వెంకటేశ్వరరావు,
 డీఎస్పీ, కొవ్వూరు.
 
 ఒరిజనల్ రికార్డు
 ఇవ్వమని అడిగాం
 చాగల్లు బ్రాంచి కేసుకు సంబంధించి ఒరిజనల్ రికార్డు ఇవ్వమని అడిగాం. విచారణకు ఒక లైజనింగ్ అధికారిని కేటాయించమని చెప్పాం. వారు స్పందించలేదు. ఈ కేసులో రూ.16 లక్షల రికవరీ జరిగింది. ఈ నెల 28వ తేదీకి మరికొంత రికవరీ వచ్చే అవకాశం ఉంది. డీసీసీబీ అధికారులు సహకరిస్తే వారంలో కేసు దర్యాప్తు పూర్తి చేస్తాం.
 - ఎం.బాలకృష్ణ, సీఐ, నిడదవోలు.
 

మరిన్ని వార్తలు