పౌష్టికాహారం అందని ద్రాక్షేనా!

30 Nov, 2018 14:19 IST|Sakshi

ఐసీడీఎస్‌లో నెల రోజులుగా ఆగిన గుడ్ల సరఫరా  

ప్రొద్దుటూరు : అన్న అమృత హస్తం పథకంలో భాగంగా ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంలో గర్భిణులు, బాలింతలతోపాటు ఎంపిక చేసిన చిన్నారులకు గుడ్డు వడ్డించాల్సి ఉంది. పౌష్టికాహారం అందించేందుకు రూ.కోట్లు వెచ్చించి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెలా ఈ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు 1.50 లక్షల గుడ్లు సరఫరా చేయాల్సి ఉంది. గత నెల రోజులుగా గుడ్ల సరఫరా ఆగిపోయింది. ఈ కారణంగా అంగన్‌వాడీలు వీరికి భోజనం మాత్రమే పెట్టి పంపుతున్నారు.  ప్రొద్దుటూరు అర్బన్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని 196 అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు 1268 మంది, బాలింతలకు 1187 మంది, చిన్నారులు 14,448 మంది ఉన్నారు. 

  • స్వరాజ్యనగర్‌ సెక్టార్‌ పరిధిలో దాదాపుగా అన్ని ఎస్సీ అంగన్‌వాడీ కేంద్రాలే ఉన్నాయి. వీరికి గత నెల రోజులుగా 6వేలకుపైగా అందాల్సిన గుడ్ల సరఫరా ఆగిపోయింది.
  • మైదుకూరు నగర పంచాయతీ పరిధిలోని 87 అంగన్‌వాడీ కేంద్రాలకు నెల రోజులుగా కాంట్రాక్టర్‌ గుడ్లు సరఫరా చేయడం లేదు. 

జిల్లాలో 15 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,268 మెయిన్, 353 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 21,711 మంది గర్భిణులు, 20,155 మంది బాలింతలు, ఏడాదిలోపు చిన్నారులు 23,700 మంది 1 నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు 76,075 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు వారు 98,842 మంది నమోదై ఉన్నారు. వీరిలో 3–6 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువ మంది అంగన్‌వాడీ కేంద్రాలకు రావడం లేదు. మిగిలిన వారందరికి ప్రతి నెల దాదాపుగా 30 లక్షల గుడ్లు కాం ట్రాక్టర్‌ సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్రకారం ఆయా ప్రాజెక్టు సీడీపీఓలు ప్రతి నెల వీరికి బిల్లులు చెల్లిస్తున్నా రు. గతంలో రెవెన్యూ డివిజన్ల వారి గా గుడ్ల సరఫరా కాంట్రాక్టును ప్రతి ఏడాది జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టెండ ర్లు నిర్వహించి అప్పగించేవారు.
 
కొత్త విధానానికి  తెరతీసిన ప్రభుత్వం 
   
తొలి నుంచి రెవెన్యూ డివిజన్ల వారిగా గుడ్ల సరఫరా కాంట్రాక్టర్‌ను నియమించేవారు. అయితే టీడీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా రాష్ట్ర స్థాయిలో కాంట్రాక్టు నిర్వహించి ఎంపిక చేసిన కంపెనీలకు జిల్లాల వారీగా కాంట్రాక్టును అప్పగించింది. ఈ ప్రకారం వైజాగ్‌కు చెందిన యునైటెడ్‌ ట్రేడర్స్‌ వారు కాంట్రాక్టు దక్కించుకుని గుడ్లు సరఫరా చేశారు. గతంలో నెక్‌ ప్రకారం మార్కెట్‌ ధరలను బట్టి కాంట్రాక్టర్లకు దబ్బు చెల్లిస్తుండగా ప్రభుత్వ పెద్దల జోక్యంతో ఏడాది పొడవునా గుడ్డుకు రూ.4.68 చొప్పున చెల్లించారు. గత ఏడాది జూలై 14 నుంచి కాంట్రాక్టు దక్కించుకున్న వీరు గుడ్లు సరఫరా చేశారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది జూలై 14తో వీరికి గడువు ముగిసింది. కారణం తెలియదు కానీ అధికారులు జూలై 15 నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌ 15 వరకు గడువు పొడిగించారు. దీంతో ఈనెల 15 నాటికి అధికారులు టెండర్లు నిర్వహించి కొత్తవారికి కాంట్రాక్టును అప్పగించాల్సి ఉంది. అలాంటిది జనవరి 2019 వరకు మరో మూడు నెలలపాటు యునైటెడ్‌ ట్రేడర్స్‌కు గడువు పొడిగించారు. ఈ లెక్కన ఆరు నెలలపాటు ఇదే సంస్థకు గడువును పొడిగించారు. ఈ సమస్య కారణంగా సంబంధిత కాంట్రాక్టర్‌ గుడ్ల సరఫరాలో జాప్యం చేస్తున్నారు. నెల రోజులుగా బకాయిపడ్డ 30 లక్షల గుడ్లను ఏవిధంగా ఎవరికి పంపిణీ చేస్తారో అర్థం కాని విషయం. కాంట్రాక్టర్‌ నిర్వాకంతో 30 లక్షల గుడ్లకు సంబంధించిన మొత్తం రూ.1.50 కోట్లు మిగిలినట్లేనని అధికారులు సంబరపడుతారో చూడాల్సి ఉంది.             

మరిన్ని వార్తలు