మందమర్రి మున్సిపాల్టీని వీడని గ్రహణం

4 Mar, 2014 00:24 IST|Sakshi

మందమర్రి రూరల్, న్యూస్‌లైన్ : మందమర్రి మున్సిపాలిటీకి పట్టిన ఎన్నికల గ్రహణం వీడటం లేదు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారిన మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం లేదు. దీంతో పట్టణ అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రామ పంచాయతీగా ఉన్న మందమర్రి కొన్ని రాజకీయ కారణాల వల్ల 1993లో నోటిఫైడ్ ఏరియాగా మారింది. ఆ తర్వాత 1995 మే 8వ తేదీన మందమర్రిని గ్రేడ్-3 మున్సిపాలిటీ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 58 వేల జనాభా ఉన్న మందమర్రి మున్సిపాలిటీలో 32 వేల మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీని 24 వార్డులుగా విభజించి 1998 మే 21వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ చైర్మన్ అభ్యర్థి పదవికి ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కేటాయించారు. దీంతో నోటిఫికేషన్ విడుదలై ఎన్నికల కోలాహలం సాగుతున్న సమయంలో  ఏజెన్సీ ఏరియాలో ఉన్న మందమర్రి గ్రామ పంచాయతీ 7/70 చట్ట పరిధిలో ఉన్న కారణంగా ఇక్కడ ఎన్నికలు నిలిపేయాలని అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్ మద్ది రాంచందర్ ప్రభుత్వం తీసుకున్న ఎన్నికల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో రిట్ ఫిటిషన్ దాఖలు చేశారు. ఒక వేళ ఎన్నికలు జరపవలసి వస్తే ఎస్టీలకు మాత్రమే చైర్మన్ పదవి కేటాయించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఎన్నికలు నిలిపేస్తూ జూన్, 18, 1998న హైకోర్టు స్టే జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తు ఆశానిర్మల కోర్టును ఆశ్రయించారు. కానీ వాది, ప్రతివాదుల తరుఫున ఎవ్వరు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఏప్రిల్, 5, 2005లో కేసును డిస్మిస్ చేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రకటించింది.

 ఎన్నికల నిర్వహణపై ఈసీ కేంద్రానికి లేఖ
 ఫిబ్రవరి, 3, 1999లో మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికల వ్యవ హారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ మున్సిపాలిటీ పరిపాలన కార్యదర్శికి లేఖ ద్వారా వివ రించింది. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించిన విషయాల్లో వివాదాలు వస్తే దాన్ని కేవలం పార్లమెంటు జోక్యం తీసుకుంటుందని, షెడ్యూల్ ఏరియాల విభాగాల చట్టం ప్రకారం బిల్లు ఆమోదించవలసి ఉంటుందని తేల్చి చెప్పింది. దీంతో మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలకు పీటముడి బిగుసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టణ ప్రజలు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఎన్నికల కోసం పోరాటాలు చేస్తున్న ప్రయోజనం లేదు.

 మున్సిపాలిటీకి ఎన్నికలు లేక 16 ఏళ్లు..
 జిల్లాలో మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపలి,్ల బైంసా, మందమర్రితో కలిసి ఏడు మున్సిపాలిటీలు ఉండగా కేవలం మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు లేక 16 ఏళ్లవుతోంది. దీంతో ప్రజా ప్రతినిధులు లేక, ప్రశ్నించే వారు కానరాక మున్సిపాలిటీ పాలనా అస్తవ్యస్తంగా మారింది. అధికారులు తమ ఇష్టారాజ్యాంగా వ్యవహరించడం. అందినంత దండుకోవడం, నిధుల దుర్వినియోగం చేయడంతోపాటు పట్టణ ప్రజలకు కనీస వసతులు కల్పించలేని పరిస్థితులో మందమర్రి మున్సిపాలిటీ కోట్టుమిట్టాడుతుంది. పన్నుల వసూలులో పురోగతి లేక పోవడంతో కార్యాలయానికి ఆదాయం తగ్గింది. ఇప్పటి వరకు మున్సిపాలిటీ కట్టవలసిన విద్యుత్ చార్జీలు రూ.70 లక్షలకు పేరుకుపోయాయి. కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకోంది.

2004లో రూ.24 కోట్ల హ డ్కో నిధులతో ప్రారంభించిన గోదావరి మంచినీటి పథకం ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో పట్టణంలోని హై లేవల్‌జోన్ ప్రాంతవాసులకు తాగునీరు అందకుండా పోతుంది. వేతనాలను ఇవ్వలేక చాలినంత సిబ్బందిని సమకూర్చుకోలేక పారిశుధ్యం పడకేసింది. రోడ్లు, డ్రెయినేజీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం 3వ గ్రేడ్ మున్సిపాలిటీ అని ప్రకటించినా ఎన్నికలు లేక, ప్రజ లకు కనీస మౌలిక వసతులు అందక మందమర్రి మున్సిపాలిటీ త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతుం ది. ఇప్పటివరకు పదవుల్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై సరైన ఒత్తిడి చేయలేక  పోవడం వల్లనే ఎన్నికలు జరుగకుండా పోతున్నాయని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. వెంటనే ఎన్నికల ప్రక్రియకు తగిన కృషి చేయాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు