ఆర్టీసీలో ‘దొంగలు పడ్డారు’!

23 Oct, 2017 09:13 IST|Sakshi

టైర్లు మొదలుకుని కంప్యూటర్లు చోరీ

ఏడేళ్ల నుంచి ఆడిట్‌ జరగని వైనం

విలువైన వస్తువులు అపహరణకు గురైనా పట్టించుకోని వైనం

కడప అర్బన్‌ : ఏపీఎస్‌ ఆర్టీసీలో సామగ్రికి భద్రత కరువైంది. దాదాపు ఏడేళ్ల నుంచి కడప డిపో పరిధిలో సామాన్లకు సం బంధించిన ఆడిట్‌ కూడా జరగలేదని ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఆర్టీసీ బస్సులోల ఏవైనా వస్తువులు ప్రయాణికులు మరిచిపోతే వెంటనే ప్రకటన ఇవ్వడంకానీ, పోలీసులకు ఫిర్యా దు చేయడంగానీ జరగాలి. అలాంటివేమీ చేయకుండానే ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహించడం పలు ఆరోపణలకు తావి స్తోంది. ఆర్టీసీలో కొందరు ఇంటి దొంగలైతే, మరికొందరు బ యటివారు ఉన్నారు. అయినా వారిపై నిఘా కరువవుతోంది.  
∙సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కడప డిపో గ్యారేజీలో టైర్లు కొన్ని మాయమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు కొత్త టైర్లు డిపో గ్యారేజీ ప్రహరీ సమీపంలో ఉన్న  ఓ పాఠశాల ఆవరణంలో పడిపోయాయి. వాటిని సంబంధిత పాఠశాల వారే ఆర్టీసీ వారికి  అప్పగించినట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ బస్టాండ్‌లోని జనరేటర్‌ చోరీకి గురైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీని విలువ దాదాపు రూ. 40 వేల నుంచి రూ.50 వేలు ఉంటుంది.
ఎర్నింగ్‌ సెక్షన్‌లో కంప్యూటర్, మానిటర్‌లను ఎత్తుకుపోయినా దిక్కులేదని అనుకుంటున్నారు.
కండక్టర్‌లకు సంబంధించిన టికెట్‌ ట్రేలు దాదాపు 20 దాకా మాయమైనప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టిమ్‌ (టికెట్‌ ఇష్యూయింగ్‌ మిషన్‌) లకు సంబంధించిన సామాన్లు కూడా గల్లంతయినట్లు సమాచారం ఉన్నా ఎలాంటి చర్యలు లేవనే చర్చ జరుగుతోంది.
ప్రతి డిపోకు ఇద్దరు క్యాషియర్‌లు బాధ్యతగా వ్యవహరించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్‌ చేయించాల్సి ఉంది. అయితే గత ఏడేళ్లుగా ఎలాంటి ఆడిట్‌ జరగలేదని సమాచారం.
అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు 800 వివిధ రకాల సామాన్లు, పరికరాలకు సంబంధించి ఎలాంటి గణాంకాలు లేకపోయినా, సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.

మా దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటాం
కడప డిపోతో పాటు అన్ని డిపోలలో ఏవైనా అక్రమాలు జరిగితే వెంటనే ఎవరైనా సరే రాత పూర్వకంగా తమ దృష్టికి తీసుకుని వస్తే విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని కడప రీజనల్‌ మేనేజర్‌ చెంగల్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం కిషోర్‌లు వివరణ ఇచ్చారు. ప్రతి ఏడాది ఒకసారి ఆడిటింగ్‌ డిపోల వారీగా జరగాల్సి ఉందన్నారు. కడప డిపోకు ఆడిటింగ్‌ ఎపుడు జరిగింది విచారించి తెలియజేస్తామన్నారు. బంగారు ఆభరణాల వ్యవహారానికి సంబంధించి బద్వేలు సంఘటనలో బాధ్యులైన వారిని సస్పెండ్‌ చేశామన్నారు. కడప డిపోలో బంగారు ఆభరణాలకు సంబంధించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.  

విలువైన వస్తువుల మాటేమిటి ?
కడప, బద్వేల్‌ డిపోల పరిధిల్లో ఇటీవల జరిగిన సంఘటనల్లో కొందరు అధికారులు, సిబ్బంది వ్యవహారం ప్రయాణికుల్లో ఆర్టీసీపై విశ్వసనీయత కోల్పోయే విధంగా ఉంది.
∙బద్వేల్‌ బస్టాండ్‌లో నాలుగు నెలల క్రితం ఓ ప్రయాణికుడు బ్యాగును మరిచిపోయి వెళ్లాడు. ఆ బ్యాగులో విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని ఆలస్యంగా బయటకు పొక్కింది. ఐదుగురు ఉద్యోగులు కలిసి పంపకాలు చేసుకోవడంలో భేదాభిప్రాయాలు వచ్చి బయట ప్రచారం జరగడంతో ఉలిక్కిపడ్డారు. ఆ నోటా, ఈ నోటా పడి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో కంగుతిన్న సదరు ఉద్యోగులు ఎంతోకొంత డబ్బులను జమచేస్తామని చెప్పుకుంటున్నట్లు సమాచారం.

కడప డిపో పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్‌ 27న అనంతపురం నుంచి గంజికుంటకాలనీకి చెందిన షేక్‌ జిలానీ భార్య రుక్సానాబేగం తన పిల్లలతో కలిసి కడపకు వచ్చింది. ముద్దనూరు వద్ద టిఫెన్‌ తీసుకుని బస్సులోనే తిన్నారు. కడపకు చేరుకునే సరికి తమ లగేజీలోని సూట్‌కేస్‌ కన్పించలేదు. దీంతో చిన్నచౌక్, ఒన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వీరినే నిందించడంతో మిన్నకుండిపోయారు. తర్వాత అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నా సూట్‌కేస్‌లోని వస్తువులను వేలం వేశారని, సుమారు 72 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్‌ చేశారని  తెలిసింది.

ఈ సంఘటనపై ఈనెల 18న సాక్షి దినపత్రికలో ‘కడప డిపోలోనే బంగారు ఆభరణాలు’ అనే శీర్షికన వార్త ప్రచురితం కావడంతో బాధితులు తగిన ఆధారాలతో అధికారులను సంప్రదించారు. అధికారులు బాధితురాలిని విచారించి, త్వరలో కమిటీ సమావేశం నిర్వహిస్తామని ఆ తర్వాత విచారిస్తామని వెల్లడించినట్లు బాధితురాలు ‘సాక్షి’కి వివరించింది.
∙ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు