పరిష్కారమేదీ?

16 Dec, 2013 07:15 IST|Sakshi

సాక్షి, నెల్లూరు :  ‘రైల్వే పరిధి’ కేసులకు ఏళ్ల తరబడి పరిష్కారం లభించడం లేదు. అందుకే రైల్వే ట్రాక్, రైళ్లు నేరాలకు అడ్డాగా మారాయి. తరచూ రైళ్లలో దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నాయి. రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యలు, హత్యలు, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి సంబంధించిన విచారణలో పురోగతి లేకపోవడంతో ఏడాదికి 80 శాతం కేసులు పరిష్కారాని కి నోచుకోలేకపోతున్నాయి. ఈ పరిణామాలే నేరాలకు వెసులుబాటు కల్పిస్తుం టే..బాధితులకు వేదన మిగులుస్తోంది. రెల్వేలో భద్రతను పర్యవేక్షించేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్‌పీ) విభాగాలు పని చేస్తున్నాయి. ఆర్‌పీఎఫ్ రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల భద్రత వంటి బాధ్యతను పర్యవేక్షిస్తుంటే.. జీఆర్‌పీ రైల్వే పరిధిలో జరిగే ప్రయాణికుల ఆస్తుల చోరీలు, దోపిడీలు, అనుమానాస్పద మరణాలు, ఆత్మహత్యలు, ప్రమాదాలపై విచారణ చేయాల్సి ఉంటుంది.
 
 జీఆర్‌పీ విభాగాన్ని పరిశీలిస్తే.. రైల్వే గణాంకాల ప్రకారం ఒక్కొక్క జీఆర్‌పీ స్టేషన్‌లో ఏడాదికి 40 నుంచి 50కి పైగా అనేక రకాల కేసులు నమోదవుతున్నాయి. ఇక  నమోదుకాని కేసులు ఇంతకు రెండింతలు పైనే ఉన్నట్లు సమాచారం. జీఆర్‌పీ సబ్ డివిజనల్ (డీఎస్పీ స్థాయి) పరిధిలో నెల్లూరు, గూడూరు, కావలి, సూళ్లూరుపేట, బిట్రగుంట, కృష్ణపట్నం రైల్వేపోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్ల పరిధి విస్తృతంగా ఉండటం, సిబ్బంది, అధికారుల కొరత కారణంగా రైల్వేలో రోజురోజుకూ నేరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రైళ్లు, స్టేషన్లలో చైన్ స్నాచింగ్, నగదు దొంగతనం, తనిఖీల పేరుతో నకిలీ పోలీసుల దోపిడీలు జరుగుతున్నాయి. వీటితో పాటు రైల్వేట్రాక్‌లపై శవాలు కనిపిస్తుంటాయి. కొందరు ప్రమాదవశాత్తు, మరి కొందరు ఆత్మహత్యలకుపాల్పడుతున్న సంఘటనలు ఉన్నాయి. ఇక రైల్వే పరిధిలో కేసులకు పరిష్కారం లేకపోవడంతో క్రిమినల్స్ హత్యలు చేసి శవాలను రైల్వేట్రాక్‌లపై వేస్తున్నారు. ఈ తరహా కేసులు అధికమయ్యాయి.
 
 అక్రమ రవాణాకు రైళ్లు సేఫ్
 రైళ్లలో తనిఖీలు, నిఘా లేకపోవడంతో అక్రమ రవాణాకు ఇవి సేఫ్‌గా మారాయి. నెల్లూరు మీదుగా దక్షిణ, ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు అనేక రైళ్లు వెళుతున్నాయి. నెల్లూరు కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు బంగారం, గంజాయి, బియ్యం, ఎర్రచందనం, ఇతర మాదక ద్రవ్యాలు, గుట్కాలు, ఆయిల్ తదితర వస్తువులు పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి బిల్లులు లేని అనేక విలువన వస్తువులు రవాణా అవుతున్నాయి. ఇటీవల నెల్లూరు రైల్వేస్టేషన్‌లో బిల్లుల్లేని సుమారు రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు పట్టుబడటం చూస్తే రైళ్లలో ఏ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతుందో అర్థమవుతోంది. ఈ బంగారం అక్రమ రవాణా ఒక ప్రయాణికురాలి నగలు చోరీ జరగడంతో తనిఖీల్లో బయపడటం విశేషం. జనరల్ కంపార్ట్‌మెంట్లలో రద్దీగా ఎక్కువగా ఉండటంతో, తనిఖీలు లేకపోవడంతో యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతోంది.
 
 నిఘా కరువు
 ప్రధాన రైల్వేస్టేషన్లలో నిఘా కొరవడింది. సిబ్బంది కొరత దీనికి ప్రధానంగా కారణంగా చెప్పొచ్చు. గూడూరులో చాలా కాలంగా ఎస్సైపోస్టును భర్తీ చేయకపోవడంతో అనేక కేసులు పెండిగ్‌లో ఉండి పోయాయి. కనీసం సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అదుపు చేసే అవకాశం ఉన్నా.. రైల్వే శాఖ వాటిపై నిర్లక్ష్యం చూపుతుంది. ప్రధానంగా జిల్లాలో జంక్షన్ కేంద్రమైన గూడూరు రైల్వేస్టేషన్‌లో 6 ప్లాట్‌ఫారాలు ఉండగా వాటిల్లో కనీసం సీసీ కెమెరాలు లేవు. రెండేళ్ల క్రితమే సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆమోదం లభించినా ఇంత వరకూ ఏర్పాటు చేయలేదు. ఇక నెల్లూరు రైల్వేస్టేషన్లో 4 ప్లాట్‌ఫారాలు ఉండగా 18 సీసీ కెమెరాాలు ఏర్పాటు చేశారు. వీటిలో 8 కెమెరాలు పనిచేయడం లేదు. తమిళనాడు సరిహద్దులో ఉన్న సూళ్లూరుపేట స్టేషన్‌లో సైతం సీసీ కెమెరాలు లేవు. ఇక్కడికి సమీపంలో షార్‌తో పాటు కృష్ణపట్నం ఓడరేవు సైతం ఉంది. ఇక్కడ ఒక ఎస్సైని నియమించాల్సిన అవసరముంది. ప్రతిపాదన ఉన్నా అది అమలుకు నోచుకోలేదు. కావలిలోనూ సీసీలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే సవాలక్ష  సమస్యలు ఉన్నాయి. ప్రతి స్టేషన్‌లోనూ ముఖ్యంగా టికెట్ కౌంటర్ల వద్ద  సీసీ కెమెరాలు తప్పనిసరి అయినా అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పలుస్టేషన్ల పరిధిలో హెడ్‌కానిస్టేబుళ్ల కొరత ఉన్నట్లు సమాచారం.
 
 భర్తీ విధానం: రైల్వేలో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ రెండు విభాగాలు ఉన్నాయి. ఆర్‌పీఎఫ్ నియామకాలను కేంద్ర ప్రభుత్వం స్వయంగా చేపడుతుంది.  ఆర్‌పీఎఫ్‌లో క్రమం తప్పకుండా నియామకాలు జరుగుతున్నాయి. ఇక జీఆర్‌పీదే సమస్యంతా. తొలుత జీఆర్‌పీ నియామకాలను సైతం 1982 వరకు కేంద్ర ప్రభుత్వం జరిపేది. ఆ తరువాత ఈ విధానానికి స్వస్తి పలికింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సివిల్ పోలీసులనే డిప్యుటేషన్‌పై రైల్వేకు పంపుతారు. రిటైర్ అయిన వారి స్థానాలతో పాటు డిప్యుటేషన్ ముగిసి తిరిగి సొంతగూటికి వెళ్లినవారి స్థానంలో ఖాళీలను భర్తీ చేయాలంటే సివిల్ నుంచి పోలీసులను రైల్వేకు పంపాల్సి ఉంది. కానీ సివిల్ పోలీసు అధికారులు సకాలంలో సిబ్బందిని ఇవ్వకపోవడంతో రైల్వేలో పోలీసు సిబ్బంది కొరత ఏర్పడిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో రైల్వేలో కేసులతో పాటు సమస్యల పరిష్కారం నత్తనడకన సాగుతోంది.

మరిన్ని వార్తలు