27న శ్రీవారి దర్శనం నిలిపివేత

22 Apr, 2019 08:31 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలోని వరాహస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కారణంగా 27న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు తిరుమల జేఈఓ కేఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. ఈ నెల 23 నుంచి 27 వరకు జరగనున్న ఈ మహాసంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తైనట్లు చెప్పారు. 22న అంకురార్పణ, 23 నుంచి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

23న రాత్రి 8 గంటల సమయంలో కళాకర్షణం ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి 27న మహాసంప్రోక్షణ వరకు భక్తులను దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. 24న యాగశాల కార్యక్రమాలు, 25న వరాహస్వామివారి మూలమూర్తి పాదపీఠిక వద్ద అష్టబంధన కార్యక్రమం, 26న మధ్యాహ్నం 3 గంటలకు అభిషేకం ఉంటుందన్నారు. 27న ఉదయం 11.07 నుంచి మధ్యాహ్నం 1.16 గంటల వరకు మహాసంప్రోక్షణ చేయనున్నట్లు చెప్పారు. అదేరోజు మధ్యాహ్నం 3:30 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు